సెన్సెక్స్ 807 పాయింట్లు క్రాష్,
251 పాయింట్లు పడ్డ నిఫ్టీ
ప్రపంచ మార్కెట్లన్నీ అతలాకుతలం
కోవిడ్ దెబ్బ మార్కెట్లకు సోమవారం బాగా తగిలింది. చైనా వెలుపల ఈ వైరస్ విస్తరిస్తుండటంతో ప్రపంచ మార్కెట్లు కిందకు పడ్డాయి. వీటి దెబ్బకు ఇండియన్ మార్కెట్లు కుదేలయ్యాయి. మరోవైపు రూపాయి బాగా బలహీనపడింది. ప్రపంచ మార్కెట్ల పతనంతో, గోల్డ్ పుంజుకుంటోంది. ఇండియన్ మార్కెట్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో ఇన్వెస్టర్లు రూ.3 లక్షల కోట్లకు పైగా సంపద పోగొట్టుకున్నారు.
మార్కెట్లపై కోవిడ్ వైరస్ పంజా విసురుతోంది. చైనాలోనే కాక, దక్షిణ కొరియాలోనూ కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో, ప్రపంచ మార్కెట్లన్నీ అతలాకుతలమయ్యాయి. ఆదివారం దక్షిణ కొరియాలో ఒక్కసారిగా కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. దీంతో అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. ఈ దెబ్బకు ప్రపంచ మార్కెట్లతో సహా ఇండియా స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది. కేంద్ర బడ్జెట్ నుంచి పోలిస్తే మన స్టాక్ మార్కెట్లకు బిగ్గెస్ట్ సింగిల్ డే లాస్ నమోదైంది. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 807 పాయింట్లు కుదేలైంది. తన కీలకమైన 41 వేల మార్క్ను కోల్పోయి 40,363.23కి పడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 251.45 పాయింట్లు నష్టపోయి 11,829.40 వద్ద క్లోజైంది. మార్కెట్లు క్రాష్ కావడంతో, ఇన్వెస్టర్ల సంపద రూ.3 లక్షల కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది.
మెటల్, ఫార్మా, ఆటో వంటి రంగాలన్నింటిలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. టాటా స్టీల్ షేరు అత్యధికంగా 6.39 శాతం పడిపోయింది. ఓఎన్జీసీ,మారుతీ, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్ షేర్లు కూడా నష్టాలు పాలయ్యాయి. కోవిడ్ వైరస్ చైనాలోనే కాక, ఇతర దేశాలకు చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే చైనాలో ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆ దేశం నుంచి ఇతర దేశాలకు ట్రేడింగ్ బాగా తగ్గిపోయింది. ఈ ప్రభావంతో గ్లోబల్ జీడీపీ 1 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. దక్షిణ కొరియాలో కొత్తగా 161 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఆ దేశంలో 763 కేసులు రికార్డయ్యాయి. ‘దక్షిణ కొరియా, ఇటలీలో కోవిడ్ వైరస్ కేసులు పెరుగుతుండటంతో, సేఫ్గా ఉండే ఆస్తులకు డిమాండ్ పెరుగుతుంది. అంతకుముందు కంటే వ్యాపారాలపై కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లు ముగిసే సమయానికి ట్రంప్–మోడీ జరిపే ట్రేడ్ డీల్పై ఎలాంటి సంకేతాలు అందలేదు’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. కోవిడ్ వైరస్ వల్ల నెలకొనే ఆర్థిక నష్టంపై ఇండియన్ మార్కెట్లలో ఇప్పుడే భయాందోళన ప్రారంభమైందని, దీంతో మార్కెట్లు బాగా క్రాష్ అయ్యాయని విశ్లేషకులు చెప్పారు. చైనాలో ప్రొడక్షన్ తగ్గడంతో సప్లయి చెయిన్లో అవాంతరాలు ఏర్పడే అవకాశం ఉందని ఇండియన్ కార్పొరేట్లు అంచనా వేస్తున్నారు.
నష్టాల్లో ఏషియన్ మార్కెట్లు…
సియోల్ స్టాక్స్ బాగా నష్టాలు పాలయ్యాయి. షాంఘై, హాంకాంగ్, టోక్యో స్టాక్ మార్కెట్లు కూడా తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. యూరప్ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. అమెరికన్ స్టాక్ మార్కెట్ డౌజోన్స్ సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 800 పాయింట్లకు పైగా నష్టాలను పొందింది. కోవిడ్ ఎఫెక్ట్తో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 4 శాతం వరకు తగ్గి బ్యారల్కు 56.10 డాలర్లుగా నమోదయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 34 పైసలు మేర బలహీనపడి మూడు నెలల కనిష్టం 71.98కు పడిపోయింది. గతేడాది నవంబర్ 13 తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. ఏషియన్ మార్కెట్లు నష్టాల్లో ఉండటంతో, రూపాయి బాగా పడిపోతోందని విశ్లేషకులన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికన్ కరెన్సీ బలపడుతోంది.
అరబిందో షేరు బేజారు…
అరబిందో ఫార్మా యూనిట్ 4కు వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ జారీ చేసిన 3 రోజుల తర్వాత, ఎఫ్డీఏ ఆ యూనిట్పై తనిఖీ ఇంకా పూర్తికాలేదని ప్రకటించింది. దీంతో గత రెండు రోజుల క్రితం 20 శాతం పెరిగిన అరబిందో షేరు సోమవారం సెషన్లో 18 శాతం వరకు పడిపోయింది.