- పాదచారులకు తప్పని ఇబ్బందులు
- నిర్వహణను వదిలేసిన ఏజెన్సీలు
- చిరు వ్యాపారులకు అడ్డాగా మారాయి
- పట్టించుకోని బల్దియా అధికారులు
- మరమ్మతులు కూడా చేయడం లేదు
- అవసరమైన చోట కొత్తగా నిర్మించట్లేదు
హైదరాబాద్, వెలుగు: సిటీలో రోజురోజుకు ఫుట్పాత్లు కనుమరుగు అయ్యేలా ఉంది. ప్రతి ఏటా వాటి సంఖ్య తగ్గుతున్నది. అధికారులు చెప్పే లెక్కల్లో 430 కిలోమీటర్లు ఉండగా.. ఒకటి, రెండు ప్రాంతాల్లో మినహా ఎక్కడా కిలోమీటర్ ఫుట్పాత్పైనా నడవలేని పరిస్థితి నెలకొంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి సంపన్నుల ప్రాంతాల్లోనూ ఫుట్పాత్లు కనిపించడం లేదు. బంజారాహిల్స్ రోడ్ నం.10,12లో రోడ్డుకు ఇరువైపులా కొన్ని కిలోమీటర్లు ఫుట్పాత్లు కలిసిపోయాయి.
ఫుట్పాత్ బాగున్న ప్రాంతంలో కూడా పాదచారులకు నడిచేందుకు వీలుగా లేకపోవడంతో రోడ్డుపై నుంచే నడుస్తున్నారు. కోఠి, దిల్సుఖ్ నగర్, సికింద్రాబాద్, అమీర్పేట్, అబిడ్స్, లంగర్ హౌస్ తదితర ప్రాంతాల్లోనూ సరిగా లేదు. ఉన్న కొన్ని చోట్ల చిరువ్యాపారులు ఆక్రమిస్తుండగా.. పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. చాలా ప్రాంతాల్లో కొత్తగా నిర్మాణం చేపడతామని చెప్పిన జీహెచ్ఎంసీ కొన్నిచోట్ల నిర్మాణాలు చేసి ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం లేదు. ఫుట్పాత్లు పూర్తిగా డ్యామేజ్ అయిన ప్రాంతాల్లో మరమ్మతులు నిర్వహించకుండా, అంతా బాగున్న ఫుట్పాత్లనే తిరిగి కొత్తగా నిర్మిస్తున్నారు. అక్కడ కూడా పాదచారులకు ఉపయోగపడనప్పటికీ బల్దియా సిబ్బంది అక్కడే నిర్మాణాలు జరుపుతుండటంపై బిజినెస్చేసే వారి నుంచి సిబ్బందికి ముడుపులు అందుతున్నాయన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
రోడ్డు ప్రమాద మృతుల్లో 15 శాతం పాదచారులే..
సిటీలోని ఫుట్పాత్ల ఆక్రమణలు తొలగించాల్సిన బల్దియా అసలు పట్టించుకోవడం లేదు. ఏడాదిలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో 15శాతం వరకూ పాదచారులే ఉంటారని నివేదికలు చెప్తున్నాయి. గ్రేటర్లో ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో కీలకమైన జీహెచ్ఎంసీ.. ఆ దిశగా చర్యలు చేపట్టడంతో పాటు తమ పొరపాట్లను సరిదిద్దుకోవాల్సిన అవసరముంది. ఇదిలా ఉంటే టాయిలెట్లు, అన్నపూర్ణ క్యాంటీన్లు, వాటర్ ఏటీఎంలతో పాటు 3 వేల బస్టాప్ల నిర్వహణను జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్నది. ఇవన్నీ ఫుట్పాత్లపైనే కొనసాగుతుండడం మరో విశేషం. ఫుట్పాత్ల ఆక్రమణలను తొలగించాల్సిన జీహెచ్ఎంసీనే ఈ విధంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడంపై విమర్శలు వస్తున్నాయి. నడక మార్గాల్లో అడ్డుగా ఉన్న ఈ నిర్మాణాలు తప్పించుకునేందుకు ఫుట్పాత్లు దిగి రోడ్లపై నడవాల్సిన పరిస్థితి. వీటితో పాటు కేబుళ్లు, డ్రైనేజీల కోసం పైపులను కూడా ఫుట్పాత్లపైనే వేస్తున్నారు. దీంతో ఎక్కడిక్కడ ఫుట్పాత్లు ఎప్పుడు డ్యామేజ్గానే ఉంటున్నాయి.
ఏజెన్సీలదే బాధ్యత అయినా..
గ్రేటర్ సిటీలోని మెయిన్ రోడ్లను కాంప్రెన్సివ్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (సీఆర్ఎంపీ) ప్రాజెక్ట్ కింద కాంట్రాక్టర్ల నిర్వహణ ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ అప్పగించింది. బల్దియా పర్యవేక్షణలో జరిగే పనులను ఏడు ప్యాకేజీలుగా విభజించింది. రూ.1,839 కోట్లలో 709.49 కిలోమీటర్ల రోడ్లను ఐదేళ్ల పాటు ఏజెన్సీలకు కట్టబెట్టింది. ఆయా రోడ్లపై రీ కార్పెటింగ్, ఫుట్పాత్ల నిర్వహణ, లేన్ మార్కింగ్, స్వీపింగ్, గ్రీనరీ నిర్వహణ తదితర పనులను ఏజెన్సీలు నిర్వహించాలి. కానీ ఫుట్పాత్ల నిర్వహణను ఏజెన్సీలు పట్టించుకోవడం లేదు. వాటి పరిధిలోకి వచ్చే కొన్ని ప్రాంతాల్లోనైతే కనీసం ఫుట్పాత్లు కూడా కనిపించడం లేదు. ఉదాహరణకు లంగర్ హౌస్లో ఇరువైపులా ఫుట్ పాత్లు పూర్తిగా కనుమరుగైనా పట్టించుకునే వారు లేరు. కొన్నిచోట్ల కూడా ప్రైవేట్ వ్యక్తులు పూర్తిగా కబ్జాలు చేశారు. దీంతో ఆయా చోట్ల వాకర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రెండేళ్లుగా స్పెషల్ డ్రైవ్ లేదు
ఫుట్పాత్లపై అక్రమ నిర్మాణాల కూల్చివేతకు జీహెచ్ఎంసీ ప్రతి ఏటా స్పెషల్ డ్రైవ్ చేపట్టేది. బల్దియా, ఎన్ఫోర్స్మెంట్, పోలీసుల సమక్షంలో డ్రైవ్ జరిగేది. పాదచారులకు అడ్డంగా ఉన్న నిర్మాణాలు తొలగించేవారు. గత రెండేళ్లుగా నిర్వహించడంలేదు. ఫుట్ పాత్ లను కూడా అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ఎక్కడపడితే అక్కడ కబ్జాలు అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వాటిపై వ్యాపారులు చేసే వారి నుంచి బల్దియా సిబ్బందితో పాటు స్థానిక లీడర్లు కొందరు మాముళ్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
బిజినెస్లకు అడ్డాలుగా మారాయి
సిటీలో ఎక్కడా ఫుట్పాత్పై నడవలేకపోతున్నాం. అన్ని ప్రాంతాల్లో బిజినెస్కు అడ్డాలుగా మారిపోయాయి. విదేశాల్లో మాదిరిగా ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది. ఫుట్పాత్లు అంటే వాటిపై నడుచుకుంటూ వెళ్లేవారే కనిపించాలి. సిటీలోని ఫుట్ పాత్ లపై పాదచారులు నడవాలంటేనే ఇబ్బందిగా మారింది.
– నరేశ్ కుమార్, ప్రైవేట్ ఉద్యోగి