దొరికితే ఖమేనీని ఖతం చేసే వాళ్లం.. కానీ కుదరలే: ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్

దొరికితే ఖమేనీని ఖతం చేసే వాళ్లం.. కానీ కుదరలే: ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్

టెల్ అవీవ్: అవకాశం వచ్చి ఉంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్ చంపి ఉండేదని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాట్జ్ హాట్ కామెంట్స్ చేశారు. కానీ ఖమేనీ తమ నుంచి తప్పించుకున్నాడన్నారు. కాన్ పబ్లిక్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాట్జ్ మాట్లాడుతూ.. ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధ సమయంలో ఖమేనీని చంపేయాలనుకున్నామని.. కానీ ఆ అవకాశం రాలేదని తెలిపారు. ఖమేనీ ఎక్కడున్నాడన్న విషయం మాకు స్పష్టంగా తెలిస్తే అతడిని లేపేసే వాళ్లమని పేర్కొన్నాడు. ఇజ్రాయెల్ ఇరాన్ అగ్ర అధికారులను లక్ష్యంగా చేసుకోవడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని చెప్పారు. 

కాగా, ఇటీవల ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఇరు దేశాల పరస్పరం మిస్సైళ్లు, బాంబుల వర్షం కురిపించుకున్నాయి. ఇరాన్ అణు శాస్త్రవేత్తలు, టాప్ కమాండర్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ హతమార్చింది. ఇదే సమయంలో.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేస్తేనే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుతాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో మాకు.. అతడిని చంపేయం మాకు పెద్ద మ్యాటర్ కాదు అంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు. సీనియర్ సైంటిస్టులు, టాప్ కమాండర్లను చంపడంతో పాటు అమెరికా, ఇజ్రాయెల్ ఖమేనీ లక్ష్యంగా  పావులు కదుపుతుండటంతో ఇరాన్ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తలో భాగంగా ఖమేనీని రహస్య ప్రదేశానికి తరలించారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడుల సమయంలో ఖమేనీ బహిరంగంగా ఎక్కడ కనిపించలేదు. 

ఆయనను పూర్తిగా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కు దూరంగా ఉంచారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అవగాహన ఒప్పందం కుదరడంతో యుద్ధం ఆగిపోయింది. సైజ్ ఫైర్ కుదిరిన కొన్ని రోజుల తర్వాత ఖమేనీ బహ్యా ప్రపంచానికి కనిపించారు. యుద్ధంలో ఇరానే గెలిచిందని.. ఇజ్రాయెల్, అమెరికాను దెబ్బ కొట్టామని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఛానెల్‎లో దేశ ప్రజలనుద్దేశించి ప్రసగించారు.