
ముంబై: తొలి సీజన్లో సక్సెస్ అయిన విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో ఎడిషన్కు కీలక ముందడుగు పడనుంది. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ కోసం ప్లేయర్ల వేలం శనివారం ముంబైలో జరగనుంది. ఐదు జట్లలో మొత్తం 30 బెర్తులు ఖాళీగా ఉండగా మొత్తం 165 ప్లేయర్లు వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 104 మంది ఇండియన్స్ కాగా మరో 61 మంది ఫారిన్ ప్లేయర్లు ఉన్నారు. గత ఎడిషన్లో చివరి ప్లేస్లో నిలిచిన గుజరాత్ జెయింట్స్, నాలుగో స్థానంతో సరిపెట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈసారి మెరుగైన ప్లేయర్లతో తమ జట్లను బలోపేతం చేసుకోవాలని ఆశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమకు సరితూగే ప్లేయర్లపై కాసుల వర్షం కురిపించేందుకు సిద్ధమయ్యాయి. ఫారినర్స్లో రూ. 50 లక్షల బేస్ప్రైజ్ కేటగిరీలో బరిలో నిలిచిన వెస్టిండీస్ క్రికెటర్ దియేంద్ర డాటిన్, రూ. 40 లక్షల బేస్ ప్రైజ్లోని ఆసీస్ ఆల్రౌండర్లు అనాబెల్ సదర్లాండ్స్, జార్జియా వారెహామ్, సఫారీ క్రికెటర్ షబ్నిమ్ ఇస్మాయిల్, ఇంగ్లండ్ కీపర్ అమీ జోన్స్ పై ఫోకస్ ఉంది. డానీ వ్యాట్, టామీ బ్యూమోంట్, చామరి ఆటపట్టు, డిక్లెర్క్, ఇండియన్స్ వేదా కృష్ణమూర్తి, పూనమ్ రౌత్, సుష్మా వర్మ, ఏక్తా బిస్త్ కూడా ఫేవరెట్లుగా కనిపిస్తున్నారు. గుజరాత్ జెయింట్స్ దగ్గర అత్యధికంగా రూ.5.95 కోట్ల మొత్తం మిగిలుంది.