
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోరులో భారత్ ఓటమి దిశగా పయనిస్తోంది. 444 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన టీమిండియా 90 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ధాటిగా అడే ప్రయత్నం చేస్తూ భారత బ్యాటర్లు ఒకరివెంట మరొకరు పెవిలియన్ చేరుతున్నారు. గిల్(18) మరోసారి నిరాశ పరచగా.. రోహిత్(43), పుజారా(27) పరుగుల వద్ద వెనుదిరిగారు.
వన్డే ఫార్మాట్ తరహాలో బ్యాటింగ్ చేస్తున్న భారత ఓపెనర్లకు మొదట విలన్ రూపంలో థర్డ్ అంపైర్ అడ్డుతగిలాడు. బాల్ భూమిని తాకినట్టు స్పష్టంగా కనిపించినప్పటికీ.. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి గిల్ బలయ్యాడు. 18 పరుగుల వద్ద బోలాండ్ బౌలింగ్లో గిల్ వెనుదిరిగాడు. ఆ తరువాత పుజారాకు జత కలిసిన రోహిత్.. దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే నాథన్ లియాన్ ఓవర్లో హిట్మ్యాన్ స్వీప్ షాట్ ఆడబోయి ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఓవర్లోనే పూజారా షాట్ ఆడబోయి కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం భారత జట్టు స్కోర్.. 93/3. అజింక్యా రహానే(0), విరాట్ కోహ్లీ(0) క్రీజులో ఉన్నారు. టీమిండియా విజయానికి ఇంకా 351 పరుగులు కావాలి.