
-
కేటీఆర్..ఇరిగేషన్ పై అవగాహన లేక మూర్ఖంగా మాట్లాడిండ్రు
-
అన్నారం బ్యారేజీ వద్ద పంటపొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే
-
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
-
చెన్నూరు టౌన్లో ఎమ్మెల్యే మార్నింగ్ వాక్
కోల్ బెల్ట్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల పంటలు నష్టపోతున్న రైతులను ఆదుకోవడానికి కార్యచరణ చేసిందని, పంటలు మునగకుండా కరకట్టల కట్టేందుకు ప్రయారిటీ ఇస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా సుందర శాల వద్ద గల నిర్మించిన అన్నారం బ్యారేజీను సందర్శించి మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమిటీ మరింత అధ్యయనం చేసి కరకట్టల నిర్మాణంపై పూర్తి నివేదిక తయారు చేసే పనిలో ఉందన్నారు.
భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా అదుకుంటుందన్నారు. బ్యాక్ వాటర్ తో నష్టపోయిన రైతులకు ప్రభుత్వ నష్టపరిహారం అందేలా కృషి చేస్త. గత బీఆర్ఎస్ పాలకులు బ్యాక్ వాటర్తో ముంపుకు గురైతే ఒక్క పైసా నష్టపరిహారం ఇవ్వలేదు. కాళేశ్వరం పంపులను ఆన్ చేయకపోతే 50వేల మందితో ధర్నా చేస్తామని కేటీఆర్ అవగాహన లేకుండా మూర్ఖంగా మాట్లాడిండు. ఇప్పుడు వచ్చి పరిస్థితి చూస్తే అన్నారం, ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు ఎటు వెళ్తున్నాయో కనబడుతుంది. దివంగత నేత కాకా వెంటకటస్వామి తుమ్మిడి హట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తే రూ. 33 వేల కోట్లతో ప్రాజెక్టు పూర్తవుతోందని చెప్పారు.
కానీ కేసీఆర్ కమిషన్లకు కక్కుర్తి పడి కాళేశ్వరం కట్టిండు. ఈ ప్రాజెక్టును రూ. లక్ష 25 వేల కోట్లతో కట్టి, కమిషన్లను దోచుకోవడమే కాకుండా కాంట్రాక్టర్లను ప్రపంచంలోనే ధనవంతుడుగా మార్చిండు. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో చాలా నియోజకవర్గాల్లో వేల ఎకరాల పంట పొలాలు మునిగిపోతున్నాయి. అంతకుముందు సుందరశాలను ముంపు గ్రామంగా ప్రకటించి మార్కెట్ వాల్యూ ప్రకారం పరిహారం ఇప్పించేందుకు కృషి చేయాలని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. చెన్నూరు టౌన్లోని వార్డుల్లో మార్నింగ్ వాక్ లో పాల్గొని స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలిచ్చారు.