- ఉదయం వెన్నకృష్ణుడిగా, సాయంత్రం కాళీయమర్ధనుడిగా భక్తులకు దర్శనం
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. శుక్రవారం నాలుగో రోజు ఉదయం వెన్నకృష్ణుడిగా, సాయంత్రం కాళీయమర్దనుడిగా నారసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో స్వామివారికి నిత్య ఆరాధనలు ముగిసిన తర్వాత అర్చకులు నారసింహుడిని వెన్నకృష్ణుడి అలంకారంలో అందంగా ముస్తాబు చేశారు. అనంతరం ఆలయ తిరువీధుల్లో విహరింపజేసి భక్తులకు దర్శనం కల్పించారు.
సాయంత్రం యాదగిరీశుడిని కాళీయమర్ధనుడి అలంకారంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బంగారు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు ధరించిన నారసింహుడు.. కాళీయమర్ధనుడి అలంకారంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఐదో రోజైన శనివారం స్వామివారికి వటపత్రశాయి, వైకుంఠనాథుడి అలంకార సేవలు చేపట్టనున్నారు. ఉదయం వటపత్రశాయి అలంకారంలో, సాయంత్రం వైకుంఠనాథుడి అలంకారంలో ముస్తాబు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
