
రాజీవ్ గాంధీ కుటుంబం ఐఎన్ఎస్ విరాట్ను టాక్సీలా వాడుకుందని, అందులో ఫ్యామిలీ మొత్తం ఓ ఐల్యాండ్కు పది రోజుల హాలిడే ట్రిప్కు వెళ్లిందని బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్కు కాంగ్రెస్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇండియన్ ఎయిర్ఫోర్స్ జెట్స్ను మోడీ సొంత టాక్సీలా ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారని గురువారం మండిపడింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల వైఫల్యాలు వెంటాడుతుండడంతో ప్రధాని భయపడుతున్నారని, అందుకే తన తప్పులను మరొకరిపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఐఎన్ఎస్ విరాట్ను రాజీవ్ గాంధీ ఎప్పుడూ సొంత అవసరాలకు వాడుకోలేదన్నారు. ప్రధాని తన 240 అనధికారిక పర్యటనల కోసం వాడుకున్న ఐఏఎఫ్ జెట్స్ కోసం బీజేపీ ఇండియన్ ఎయిర్ఫోర్స్కు కోటీ 40 లక్షలు చెల్లించిందని చెప్పారు. ఈ ఏడాది జనవరి 15న ప్రధాని పర్యటనకు వాటిన జెట్కు కేవలం రూ.744 చెల్లించారని ఆరోపించారు. ‘ప్రధాని చెప్పింది అబద్ధం. రాజీవ్ కేవలం అధికార కార్యక్రమాలకే విరాట్లో ప్రయాణించారు. అది విహారయాత్ర కాదు. మోడీ నిజాలను పట్టించుకోరు’ అని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా దుయ్యబట్టారు. ఇండియన్ నేవీ వైస్ అడ్మినరల్ వినోద్ పశ్రిచా కూడా ఆనాడు రాజీవ్ అధికారిక కార్యక్రమాలకే విరాట్ను ఉపయోగించుకున్నారని చెప్పారన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన దివంగత ప్రధాని రాజీవ్పై విమర్శలు చేయడం ప్రధాని మోడీకి తగదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అహ్మద్ పటేల్ ట్వీటర్లో కామెంట్ చేశారు. రాబోయే ఫలితాలను తలచుకుని ప్రధాని మోడీ భయపడుతున్నారని, వాళ్ల అబద్ధపు ప్రచారాలు చివరిదశకు చేరాయని ఎన్సీపీ జనరల్ సెక్రటర్ శంకర్సింగ్ వాఘేలా విమర్శించారు.