చందమామను దగ్గరి నుంచి చూడాలనుందా?

చందమామను దగ్గరి నుంచి చూడాలనుందా?

చందమామ రావే.. జాబిల్లి రావే అంటూ పిల్లలకు గోరు ముద్దలు తినిపిస్తుంది అమ్మ. నిజంగా ఆ చందమామ మన దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది? అది కాని పని కదా. అందుకే మనమే చంద్రుడి దగ్గరకు పోయేలా ముంబైలోని నెహ్రూ ప్లానెటోరియం ఓ సరికొత్త అవకాశం కల్పిస్తోంది. ఆగండాగండి.. అది నిజం చంద్రుడు కాదు. ప్లానెటోరియంపై ఏర్పాటు చేసిన ‘లూనార్​ డోమ్​’ అది. ఇస్రో చంద్రయాన్​ మిషన్లను గౌరవిస్తూ ఈ లూనార్​ డోమ్​ను ఏర్పాటు చేశారు. వచ్చిపోయే జనం దాని దగ్గరకు వెళ్లి చందమామ దగ్గరకు వెళ్లొచ్చామన్న ఫీలింగ్​ ఇవ్వనున్నారు. స్టార్ట్​ ఇండియా ఫౌండేషన్​తో కలిసి ఏషియన్​ పెయింట్స్​ ఈ డోమ్​ ఏర్పాటులో పాల్పంచుకున్నాయి. ఈ డోమ్​ వ్యాసం 25.6 మీటర్లుంది. రాత్రయితే చాలు అచ్చం చందమామలా ఆ డోమ్​ వెలిగిపోతుంది. రాజ్​కోట్​ శరద్​ ఆర్ట్​కు చెందిన గులామ్​ మహ్మద్​ బుఖారి,  కడారి అలామియా, మునీర్​ అబ్దుల్​ రషూల్​ బుఖారిలు కలిసి ఈ డోమ్​ను కట్టారు. దేశంలో కట్టిన అతిపెద్ద చందమామ బొమ్మ ఇదే కావడం విశేషం. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఆ డోమ్​ను చూసే అవకాశం కల్పిస్తున్నారు.