- సింగరేణిలో ఫిట్టర్ ట్రైనీ నియామకాల్లో దళారుల దందా
- పేపర్ లీక్ చేస్తామంటూ రూ. లక్షల్లో బేరాలు
- మణుగూరులో సింగరేణి ఉద్యోగి అరెస్టు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పైసలిస్తే సింగరేణిలో జాబ్ ఇప్పిస్తామంటూ దళారులు నిరుద్యోగులను మోసగిస్తున్నారు. ఆదివారం జరుగనున్న సింగరేణి ఫిట్టర్ ట్రైనీ ఎగ్జామ్పేపర్ లీక్ చేస్తానంటూ డబ్బులు వసూలు చేస్తున్న సింగరేణి ఉద్యోగిని మణుగూరు పోలీసులు శనివారం పట్టుకున్నారు. సింగరేణిలో 128 ఫిట్టర్ట్రైనీ పోస్టుల భర్తీకి ఆదివారం ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. 2,681 మంది పరీక్షకు హాజరవుతున్నారు. కొత్తగూడెంలో ఐదు సెంటర్లు ఏర్పాటు చేశారు. కొందరు దళారులు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలు ఇస్తే ఎగ్జామ్ పేపర్ లీక్ చేస్తామంటూ బేరాలకు దిగారు. శ్రీరాంపూర్, భూపాలపల్లి, మందమర్రి, కొత్తగూడెం, మణుగూరు ఏరియాల్లో కొందరు నేరుగా క్యాండిడేట్ల ద్గరకు వెళ్లి మాట్లాడుతున్నారని వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సింగరేణి డైరెక్టర్ ఎన్. బలరాం స్వయంగా ప్రకటన చేశారు. సింగరేణి విజిలెన్స్అధికారులు కూడా రంగంలోకి దిగారు. పేపర్లీక్ చేస్తామని బేరాలాడుతున్నాడన్న అనుమానంతో మణుగూరు ఓపెన్కాస్టులో పనిచేస్తున్న ఓ జూనియర్ అసిస్టెంట్ను పట్టుకుని శనివారం పోలీసులకు అప్పగించారు. గతంలో కూడా సింగరేణి నిర్వహించిన ఎగ్జామ్స్లో అక్రమాలు జరిగినందున.. ఈసారి ఎగ్జామ్ సజావుగా సాగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పక్కాగా ఏర్పాట్లు
ఎగ్జామ్లో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండాఅన్ని చర్యలు తీసుకుంటున్నాం. స్కానర్లను ఏర్పాటు చేశాం. సెంటర్ల వద్ద పోలీస్ బందోబస్తు ఉంటుంది. నిరుద్యోగులు దళారులను నమ్మి మోసపోవద్దు. ఎగ్జామ్స్ నిర్వహణ, నియామకాలు పారదర్శకంగా జరుగుతాయి.
- ఎ. ఆనందరావు, జీఎం(పర్సనల్), సింగరేణి కాలరీస్ కంపెనీ