జగిత్యాల: దేవుడి బ్రహ్మోత్సవాల్లో అపశృతి.. అప్పటి దాక దేవుడి నామస్మరణతో ఆనందంగా ఆడిపాడిన చిన్నారి అంతలోనే విగతజీవిగా మారింది. తోటి చిన్నారులోత కలిసి కోలాటం ఆడుతూ నృత్యాలు చేస్తూ ఆలయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఆ బాలిక.. కరెంట్ కు బలైంది. వివరాల్లోకి వెళితే..
గత మూడు రోజులుగా కొడిమ్యాల మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి మూడో రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా గ్రామ ప్రజలంతా కోలాటం, భక్తి కార్యక్రమాల్లో ఆనందంగా పాల్గొన్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన నాగరాజు, మమతల కుమార్తె మధుశ్రీ(11) తోటి చిన్నారులతో కలిసి కోలాటం ఆడుతూ ఉండగా కరెంట్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
అప్పటి వరకు స్వామి వారి కల్యాణోత్సవం ఉత్సాహంగా పాల్గొన్న మధుశ్రీ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.
