ప్రస్తుతం కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు డాక్టర్లు చేస్తున్న కృషి అభినందనీయం. అందుకు ప్రపంచం మొత్తం డాక్టర్లను దేవుళ్లతో పోలుస్తున్నారు. అటువంటి వృత్తిలో ఉన్న డాక్టర్ హాస్టల్ గదిలో శవమై తేలింది. చెన్నైలోని కిల్పాక్ మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ గా పనిచేస్తున్న లేడీ డాక్టర్ గదిలో చనిపోయి కనిపించింది.
కంపల్సరీ రొటేటరీ రెసిడెన్షియల్ ఇంటర్న్షిప్ (సిఆర్ఆర్ఐ) వైద్యురాలిగా ఉన్న ఓ మహిళ ఈ మధ్యనే తన తల్లిదండ్రులతో కలిసి ఇండోనేషియా ట్రిప్ వెళ్లొచ్చింది. ఆ తర్వాత వారందరూ హోం క్వారంటైన్ లో ఉన్నారు. హోం క్వారంటైన్ ముగిసిన తర్వాత ఆమె ఏప్రిల్ 18న కేఎంసీలో తిరిగి విధులలో చేరింది. అప్పటి నుండి ఆమె కాలేజీ హాస్టల్లోనే ఉంటుంది. ఆమెకు ప్రసూతి మరియు గైనకాలజీ విభాగంలో విధులను కేటాయించారు.
అయితే శుక్రవారం ఉదయం ఆమె స్నేహితులు ఆమెను కలవాడానికి హాస్టల్ గదికి వచ్చారు. ఎన్నిసార్లు తలుపు కొట్టినా తీయకపోవడంతో.. వారు ఆమె మొబైల్కు ఫోన్ చేశారు. అయినా కూడా ఆమె నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో.. ఆమె స్నేహితులు వెంటనే హాస్టల్ సిబ్బందికి ఫిర్యాదుచేశారు. హాస్టల్ సిబ్బంది వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా.. అప్పటికే ఆమె అపస్మారక స్థితిలో ఉన్నట్లు గమనించారు. హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం తెలియజేసి.. ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి రాగానే ఆమెను పరిశీలించిన వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. ఆమె వెల్లూర్లో నివసించే తన తల్లిదండ్రులతో చివరిసారిగా గురువారం రాత్రి మాట్లాడినట్లు సమాచారం.
హౌస్ సర్జన్ మృతిచెందిన విషయం తెలిసిన తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ బీలా రాజేష్ హాస్టల్ ను సందర్శించి విచారణ జరిపారు. ‘ఆమెను కరోనా డ్యూటీ కోసం కేటాయించలేదు. ఆమె ప్రస్తుతం ప్రసూతి మరియు గైనకాలజీ విభాగంలో పని చేస్తుంది. ఆమెకు కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది. అంతేకాకుండా ఆమె శరీరంపై ఎటువంటి గాయాలు కూడా లేవు. అందువల్ల పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు’ అని ఆయన తెలిపారు.
For More News..
