- హాస్పిటల్ ఎదుట కుటుంబీకుల ఆందోళన
ఎల్బీనగర్, వెలుగు: పైల్స్ సమస్యతో బాధపడుతున్న ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ దవాఖాన ఎదుట ఆందోళనకు దిగారు. మేడ్చల్ జిల్లా మల్లాపూర్ లోని ఎన్టీఆర్ నగర్ లో ఉంటున్న చెమ్మ రవితేజ(17) ఇంటర్ చదువుతున్నాడు. కొద్దిరోజులుగా పైల్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. 20 రోజుల క్రితం ఆయనను హయత్నగర్లోని సైదా పైల్స్ క్లినిక్కు తీసుకెళ్లగా, సర్జరీ చేయాలని సూచించారు.
తీవ్ర రక్తస్రావంతో బాధపడుతుండటంతో తిరిగి 12న అదే ఆసుపత్రికి వచ్చారు. అప్పటి నుంచి ప్రతిరోజూ చికిత్స చేయించి ఇంటికి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర జ్వరం రావడంతో చైతన్యపురి లోని ఓ మల్టీ స్పెషాలిటీ దవాఖానకు రెఫర్ చేశారు. అక్కడ కొంతకాలం చికిత్స పొంది,
తరువాత ఎల్బీనగర్లోని రష్ కేర్ దవాఖానకు తరలించారు. 22న ఇక్కడి నుంచి పరిస్థితి విషమంగా ఉందంటూ పంజాగుట్ట లోని నిమ్స్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ డ్యూటీ డాక్టరలు పరీక్షించి, రవితేజ చనిపోయినట్లు ప్రకటించారు. సైదా పైల్స్ క్లినిక్ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే మృతిచెందాడని ఆరోపిస్తూ, మృతుడి బంధువులు ఆదివారం క్లినిక్ ఎదుట ఆందోళన చేశారు. హయత్ నగర్ పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
