- డబ్బులివ్వకపోతే సోషల్ మీడియాలో వీడియోలు పెడతా
- ఇన్ స్టాగ్రామ్లో యువకుడికి యువతి వేధింపులు
- పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
గచ్చిబౌలి, వెలుగు: మార్ఫింగ్ చేసిన వీడియో కాల్స్ను సోషల్ మీడియాలో పెడతానంటూ ఇన్ స్టాగ్రామ్లో పరిచయమైన యువతి వేధిస్తోందని ఓ యువకుడు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని ఐసీఐసీఐ బ్యాంక్లో పనిచేస్తున్న సాయికుమార్(26) దగ్గరలోని హాస్టల్లో ఉంటున్నాడు. కొన్ని రోజుల కిందట ‘స్వీట్ గర్ల్ 948’ పేరుతో ఉన్న అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. సాయికుమార్ రిక్వెస్టును యాక్సెప్ట్ చేసి సదరు యువతితో చాటింగ్ చేశాడు. కొంతకాలం తర్వాత వీడియో కాల్స్చేసుకున్నారు. వాటిని రికార్డు చేసుకున్న యువతి.. ఆ వీడియోలను మార్ఫింగ్ చేసి న్యూడ్గా మార్చింది. తనకు డబ్బులు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ సాయికుమార్ను వేధించడం మొదలుపెట్టింది. అతడి ఫ్రెండ్స్కు ఆ వీడియోలను షేర్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేయడంతో గురువారం సాయికుమార్ గచ్చిబౌలి పీఎస్లో కంప్లయింట్ చేశాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.