యువతి మిస్సింగ్.. 18 రోజులైనా వీడని మిస్టరీ

యువతి మిస్సింగ్.. 18 రోజులైనా వీడని మిస్టరీ

కన్న కూతురు ఒక్కరోజు కళ్లముందు లేకపోతేనే తల్లిదండ్రులు అల్లాడిపోతారు. ఆమె ఎక్కడికి వెళ్లిందని ఆరా తీస్తారు. ఒకవేళ జాబ్, బిజినెస్ పర్పస్ లో ఇతర ప్రాంతాలకు వెళితే.. ఆడియో, మీడియో కాల్స్ చేసి పూట పూటకు యోగ క్షేమాలు తెలుసుకుంటారు. అలాంటిది కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 18రోజుల క్రితం ఓ యువతి మిస్ అయింది. అయితే తల్లిదండ్రులు ఆమెపై కంప్లేంట్ ఇచ్చినా ఇప్పటివరకు ఆమె ఎక్కడ ఉంది.. ఎటు వెళ్లింది.. ఏమైందనే విషయాలు మాత్రం ఇప్పటికీ తెలియరాలేవు. వివరాల్లోకి వెళితే.. 

జీడిమెట్ల చింతల్ లో నివాసముండే శివ కుమార్ కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందులో మూడవ అమ్మాయి స్పందన(18) ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. 2023 డిసెంబర్ 23న ఉదయం ఇంట్లో నుంచి వెళ్లింది. అయితే ఆ రోజు నుంచి స్పందన తల్లిదండ్రులు తెలిసిన వాళ్లందరికీ అడిగారు.. వెతకని చోటు లేదు.. కానీ అమ్మాయి ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో స్థానిక జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో తన కూతురు మిస్ అయిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే గతనెల కంప్లెంట్ చేస్తే.. ఈరోజు(జనవరి 10) వరకు తన కూతురు జాడ తెలియరాలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. పోలీసులు పట్టించుకోవడం లేదని.. ముమ్మర దర్యాప్తు చేపడితే తన కూతురు దొరికే అవకాశం ఉందని కోరారు. 

కాగా స్పందన కుటుంబమంతా ప్రతీ ఆదివారం చర్చికి వెళ్తామని.. అయితే అక్కడ నవీన్ అనే వ్యక్తితో తనకు పరిచయం ఏర్పడిందని స్పందన తల్లిదండ్రులు తెలిపారు. స్పందన మిస్ అయిన రోజే నవీన్ ఇంట్లో నుంచి స్నేహితుడి దగ్గరకు వెళ్తానని చెప్పి వెళ్లిపోయాడని అని భార్య చెప్పిందని వివరించారు. అయితే తమ అమ్మాయి స్పందనను నవీన్ తీసుకెళ్ళి ఉంటాడనే అనుమానం ఉందని.. విచారణ జరిపించాలని కోరారు.