- వరుస అత్యాచార ఘటనలపై నిరసన
- సీఎం కేసీఆర్ స్పందించాలంటూ డిమాండ్
ఖైరతాబాద్,వెలుగు: సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ ముందు యూత్ కాంగ్రెస్ నేతలు మెరుపు ధర్నా చేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న వరుస అత్యాచారాల ఘటనలను నిరసిస్తూ గురువారం ప్రగతిభవన్ను ముట్టడించారు. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ఏం పట్టనంటూ సీఎం కేసీఆర్ మౌనంగా ఉండడం సరికాదని మండిపడ్డారు. వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అమలవుతున్నాయా అని నిలదీశారు. జూబ్లీహిల్స్ ఘటనలో వక్ఫ్బోర్డు చైర్మన్ కారులోనే అత్యాచారం జరిగినందున ఆయనను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటనలపై మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు నోరెత్తక పోవడం బానిసత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి మహమూద్ అలీ,మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతామన్న కేటీఆర్.. విచ్చలవిడిగా పబ్లకు అనుమతిస్తూ నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్నీషియా పబ్పై చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణాలేంటని ప్రశ్నించారు. సీఎం స్పందించేదాకా నిరసనలు చేస్తామన్నారు.