
హైదరాబాద్, వెలుగు: తండ్రీకూతురు గురించి అసభ్యకరమైన కామెంట్స్ చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు(29)ను రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. బెంగళూరులో అదుపులోకి తీసుకుని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అనుమతితో ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని గురువారం హైదరాబాద్ కు తీసుకురానున్నారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నారు.
ప్రణీత్ హనుమంతు యూట్యూబ్లో తండ్రీ కూతురు గురించి అసభ్యకరమైన పదజాలంతో కంటెంట్ పోస్ట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హీరో సాయిదుర్గ తేజ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అలాగే, సీఎం రేవంత్రెడ్డితో పాటు పోలీసులకు ట్యాగ్ చేశారు. హనుమంతు పోస్ట్ చేసిన వీడియో లింక్ ఆధారంగా రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఆదివారం కేసు రిజిస్టర్ చేశారు. అతడు బెంగళూరులో ఉన్నట్టు తెలుసుకున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన సైబర్ క్రైమ్ పోలీసుల టీం బుధవారం బెంగళూరుకు చేరుకొని అతన్ని అరెస్ట్ చేశారు. అలాగే, హనుమంతు టీమ్లోని మరికొంత మంది కోసం కూడా సైబర్ క్రైమ్ పోలీసులు గాలిస్తున్నారు.