కార్మికులను పురుగుల్లా చూస్తున్నారు : షర్మిల

 కార్మికులను పురుగుల్లా చూస్తున్నారు :  షర్మిల

కార్మికులను సీఎం కేసీఆర్ ఎడమకాలి చెప్పుకింద తొక్కి పెట్టారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కార్మికులను పురుగుల్లా చూస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు హక్కుల కోసం పోరాటం చేస్తే.. సీఎం కేసీఆర్ వారికి కనీసం గౌరవం కూడా ఇవ్వలేదని విమర్శించారు. అదేవిధంగా విద్యుత్ శాఖలో కార్మికులు సమ్మె చేస్తే వారిని కూడా రాష్ట్రప్రభుత్వం తొక్కి పెట్టిందని చెప్పారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని వైఎస్సార్టీపీ పార్టీ కార్యాలయంలో మేడే వేడుకల్లో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. 

కార్మిక వ్యతిరేక విధానాలే..

రాష్ట్ర సర్కార్ కార్మికులను భయబ్రాంతులకు గురిచేసి సమ్మెను విచ్ఛిన్నం చేస్తోందని పేర్కొన్నారు. కార్మిక సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని..వారంతా కేసీఆర్ కి బానిసలా బ్రతకాలా..? అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో కోటిమంది కార్మికులు ఉన్నారని.. వారందరికీ కార్మిక చట్టాల ప్రకారం 26వేలు కనీస జీతం ఉండాలని.. కానీ10వేల రూపాయలు కూడా ఇవ్వడం లేదని తెలిపారు.

కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం

కార్మికుల సంక్షేమం కోసం ఎటువంటి పథకాలను అమలు చేయడం లేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. కార్మికులకు 8 గంటల పని విధానం కూడా అమలు చేయడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షమంది కాంట్రాక్ట్ బేసిక్ పైనే పని చేస్తున్నారని షర్మిల తెలిపారు. ఇందులో 5వేల మందిని రెగ్యులర్ చేస్తే.. మిగిలిన కాంట్రాక్ట్ కార్మికులు ఏం కావాలని నిలదీశారు. కేంద్రం అమలు చేస్తున్న నిర్ణయాలు కూడా సరైనవి కావన్నారు. ఉపాధి హామీ పథకం కింద గొడ్డు చాకిరీ చేయించి 40 రూపాయలు ఇస్తారా అని ప్రశ్నించారు.