ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జోరుగా జీరో దందా

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జోరుగా జీరో దందా
  • విన్నింగ్ బిడ్లు ప్రకటించక ముందే కాంటాలు
  • పీవోఎస్​ మిషన్ ప్రింట్ ఇయ్యట్లే
  • లెక్కకు చిక్కకుండా వందల బస్తాలు మళ్లింపు
  • వాటాలందుతున్నాయని ఆరోపణలు 

ఖమ్మం, వెలుగు: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జోరుగా జీరో దందా సాగుతోంది. ప్రతి రోజూ వేల బస్తాల పత్తిని మార్కెట్ రికార్డుల్లో ఎంటర్​ చేయకుండా దారి మళ్లిస్తున్నారు. సీజన్​ ప్రారంభం కావడంతో దాదాపు 20 రోజుల నుంచి మార్కెట్ కు రైతులు పత్తిని తీసుకువస్తున్నారు. రెండ్రోజుల కింద ఈ సీజన్​లోనే అత్యధికంగా 20 వేల బస్తాల పత్తి మార్కెట్ కు వచ్చింది. ఇందులో 4 వేల బస్తాల పత్తిని ఆన్ లైన్​ చేయకుండానే మార్కెట్ గేట్ దాటించినట్లు ఆరోపణలున్నాయి. రెగ్యులర్ గా ఇలాగే కొన్ని వేల బస్తాలు ఈ- నామ్​ ప్రకారం ఆన్​లైన్ లో ఎంటర్​ చేయకుండానే సైడ్ చేస్తున్నారు. మార్కెట్​ సెస్​ చెల్లించకుండా తప్పించుకోవడంతో పాటు, సేల్​ ట్యాక్స్(జీఎస్టీ)ని ఎగ్గొడుతున్నారు. 

దందా జరుగుతోందిలా..

మార్కెట్ కు పత్తిని తీసుకువచ్చిన రైతులు ఒక కమీషన్​దారుడి ద్వారా ఆ పంటను అమ్ముకుంటారు. పత్తిని పరిశీలించిన తర్వాత వ్యాపారులు ఈ-నామ్​ రూల్స్​ ప్రకారం ఆన్ లైన్​లో బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది. సక్సెస్​ ఫుల్ బిడ్డర్లు ఆ పంటను కాంటా వేసుకొని తీసుకుంటారు. అయితే కాంటాలు జరిగే సమయంలో విన్నింగ్ బిడ్డర్​ లిస్ట్ రాకముందే కొంత మంది వ్యాపారులు పత్తి కాంటా చేస్తున్నారు. ఈ సమయంలో ఎలక్ట్రానిక్​ వేయింగ్​ మిషన్లకు పీవోఎస్​ మిషన్లను జత చేసి కాంటా పూర్తయిన తర్వాత దాని నుంచి ప్రింట్ తీసి రైతులకు ఇస్తే ఆటోమెటిక్​గా ఆ పంట వివరాలు ఆన్​లైన్​లో ఎంటర్​ అవుతాయి. కానీ రైతులకు ప్రింటెడ్  స్లిప్​ ఇవ్వకుండా కాంటా పూర్తి కాగానే వివరాలను అప్ లోడ్​ చేయడం లేదు. ఇలా మేనేజ్​ చేసినందుకు బస్తాకు రూ.20 చొప్పున ఆఫీసర్లు, సిబ్బందికి, ఇతర బాధ్యులకు వాటాలు ముడుతున్నట్లు చెబుతున్నారు. ఇక దడువాయికి ఇచ్చేందుకు ఒక బస్తాకి రూ.4 చొప్పున రైతుల నుంచి కట్ చేస్తున్నారు. ఆన్ లైన్​లో నమోదు కాకుండా మేనేజ్​ చేసిన బస్తాలకు అదనంగా రూ.2 చొప్పున చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. 

సహకరిస్తే తప్పేముంది..

ఈ జీరో దందా గురించి వ్యవసాయ మార్కెట్ కు సంబంధించిన ఓ అధికారి దగ్గర ప్రస్తావిస్తే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర కంటే రైతులకు ఎక్కువ రేటు ఇచ్చి పంటను కొంటున్న వ్యాపారులకు ఆ మాత్రం సహకరించాలి కదా అని అనడం గమనార్హం. అయితే మార్కెట్  అధికారులు మాత్రం ఎప్పటిలాగానే మార్కెట్ లో జీరో దందా విషయం తమ దృష్టికి రాలేదని చెబుతున్నారు. ప్రతి రైతుకు ఆన్​ లైన్​ రిసిప్ట్ ఇవ్వాలని, అలా కాంటా బిల్లు ఇవ్వని వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని అంటున్నారు.  

ఎలక్ట్రానిక్​ బిల్లు ఇయ్యలే

ఖమ్మం మార్కెట్ కు 21 బస్తాల పత్తి తీసుకువచ్చాను. క్వింటా రూ.7300 చొప్పున రేటు పడింది. కాంటా పూర్తయిన తర్వాత నాకు ఎలాంటి కంప్యూటర్​ బిల్లు ఇయ్యలేదు. పేపర్ పైనే బస్తాల చొప్పున తూకం రాసుకున్నాను. 

- కేలోత్ నాగేశ్వరరావు, 
పేరేపల్లి, కారేపల్లి మండలం