
- రాణించిన సిఫర్ట్, రచిన్, సోధీ
హరారే: ఓపెనర్ టిమ్ సిఫర్ట్ (45 బాల్స్లో 9 ఫోర్లు, 1 సిక్స్తో 75), రచిన్ రవీంద్ర (39 బాల్స్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 63) మెరుపులకు తోడు స్పిన్నర్ ఇష్ సోధీ (4/12) విజృంభించడంతో టీ20 ట్రై సిరీస్లో న్యూజిలాండ్ మరో భారీ విజయం సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్లో 60 రన్స్ తేడాతో ఆతిథ్య జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్కు వచ్చిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 190/6 స్కోరు చేసింది.
ఓపెనర్ టిమ్ రాబిన్సన్ (10) ఫెయిలైనా.. సిఫర్ట్, రచిన్ అదరగొట్టారు. ఈ ఇద్దరూ రెండో వికెట్కు 108 రన్స్ జోడించారు. మార్క్ చాప్మన్ (0), బెవాన్ జాకబ్స్ (0), శాంట్నర్ (7) నిరాశపరిచినా.. చివర్లో మైకేల్ బ్రేస్వెల్ (26 నాటౌట్) రాణించాడు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ ఎన్గరావ నాలుగు, టినోటెండ మపోసా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ టార్గెట్ ఛేజింగ్లో జింబాబ్వే 18.5 ఓవర్లలో 130 రన్స్కే కుప్పకూలింది.
టోనీ మున్యోంగ (40), డియోన్ మైయర్స్ (22), తషింగ ముసెకివా (21) పోరాడినా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరారు. కివీస్ బౌలర్లలో సోధీ నాలుగు, మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు పడగొట్టారు. సోధీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. శనివారం జరిగే ఫైనల్లో సౌతాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడనుంది.