పది దేశాల నుంచి వైదొలిగిన జొమాటో

పది దేశాల నుంచి వైదొలిగిన జొమాటో

న్యూఢిల్లీ :  ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫాం జొమాటో ఒక సంవత్సరంలోపు పది దేశాల నుంచి తప్పుకుంది.  ఖర్చులను తగ్గించుకోవడానికి వియత్నాం,  పోలాండ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న తన స్టెప్-డౌన్ అనుబంధ సంస్థలను మూసివేస్తున్నట్టు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తాజాగా తెలియజేసింది. గురుగ్రామ్ ఆధారిత ఫుడ్ డెలివరీ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ మార్చి 2023 నుంచి దాని పది అనుబంధ సంస్థలను రద్దు చేసింది.

వీటిలో రెస్టారెంట్ అగ్రిగేటర్ జొమాటో చిలీ ఎస్​పీఏ, జొమాటో మీడియా ఇండోనేషియా, జొమాటో న్యూజిలాండ్ మీడియా ప్రైవేట్​లిమిటెడ్​, జొమాటో ఆస్ట్రేలియా ప్రైవేట్​లిమిటెడ్​ఉన్నాయి. మీడియా పోర్చుగల్ యునిపెస్సోల్ ఎల్​డీఏ, జొమాటో ఐర్లాండ్ లిమిటెడ్ – జోర్డాన్, చెక్ రిపబ్లిక్ లంచ్‌‌‌‌‌‌‌‌టైమ్  జొమాటో స్లోవేకియాలనూ రద్దు చేసింది. గతంలో, జొమాటో కెనడా, యూఎస్​, ఫిలిప్పీన్స్, యూకే, ఖతార్, లెబనాన్  సింగపూర్‌‌‌‌‌‌‌‌లోని అంతర్జాతీయ వ్యాపారాలను ఆపేసింది.

 కంపెనీ ఇప్పటికీ ఇండోనేషియా, శ్రీలంక, యూఏఈలలో పనిచేస్తోంది.  అనుబంధ సంస్థల  లిక్విడేషన్ వల్ల కంపెనీ కార్యకలాపాలపై ప్రభావం చూపదని జొమాటో ప్రకటించింది.  2023 ఆర్థిక సంవత్సర వార్షిక నివేదిక ప్రకారం.. ఈ సంస్థకు జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లింకిట్​కామర్స్​, జొమాటో ఫైనాన్షియల్ సర్వీసెస్  సహా 16 డైరెక్ట్ సబ్సిడరీలు, 12 స్టెప్-డౌన్ సబ్సిడరీలు,  ఒక అసోసియేట్ కంపెనీ ఉన్నాయి.  

జొమాటో 2024 ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండు క్వార్టర్లలో లాభాలను సాధించింది. సెప్టెంబర్ క్వార్టర్​లో రూ.36 కోట్ల నికర లాభాన్ని  జూన్ క్వార్టర్​లో రూ.2 కోట్ల లాభాన్ని నివేదించింది.  ఆర్డర్ వాల్యూమ్ పెరుగుదల కారణంగా రెండో క్వార్టర్​లో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 71శాతం పెరిగి రూ.2,848 కోట్లకు చేరుకుంది. సెప్టెంబరుతో ముగిసిన క్వార్టర్​లో కంపెనీ మొత్తం ఖర్చులు రూ.3,039 కోట్లకు పెరిగాయి. శుక్రవారం జొమాటో షేర్లు 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇది 2.89శాతం పెరిగి రూ.133.50 వద్ద ముగిసింది.