
- మెటా ఫండ్ ప్రో యాప్లో అధిక కమీషన్లు, విదేశీ టూర్ల పేరిట గాలం
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు రూ.60కోట్ల దందా
- ఇటీవల జగిత్యాల, కొడిమ్యాలలో ముగ్గురి అరెస్ట్
జగిత్యాల, వెలుగు: యువత, అమాయక ప్రజలే లక్ష్యంగా క్రిప్టో కరెన్సీ, మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట నిర్వాహకులు ప్రలోభాల వల విసురుతున్నారు. మల్టీ లెవల్ మార్కెటింగ్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపుతూ భారీగా పెట్టుబడులు పెట్టిస్తున్నారు. వీటిపై అవగాహన లేని యువత, అమయాకులు పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోతున్నారు.
రెండేళ్లలో ఇలా రూ.వందల కోట్లు నష్టపోయినట్లు సమాచారం. బాధితుల్లో కొందరు పోలీసులను ఆశ్రయిస్తుండగా, మరికొందరు పరువు పోతుందని సైలెంట్గా ఉంటున్నారు. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కేవలం మెటాఫండ్ ప్రో యాప్ ద్వారా దాదాపు రూ.60కోట్లు విదేశాలకు తరలించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటీవల ఈ యాప్లు నిర్వహిస్తున్న నలుగురిపై కేసులు పెట్టగా.. ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ఆన్లైన్ వేదికగా ఆకర్షణ
కొన్నేండ్లుగా ఆన్లైన్ వేదికగా క్రిప్టో కరెన్సీ, మల్టీ లెవెల్ మార్కెటింగ్, మెటా ఫండ్ ప్రో యాప్లతో మోసాలు పెరిగాయి. యూనిటీ మెటా, రెక్సోస్, మెటా ఫండ్, అల్టిమా వంటి సంస్థలు క్రిప్టో కరెన్సీ పేరుతో మల్టీ లెవల్ మార్కెటింగ్ బిజినెస్ నిర్వహిస్తున్నాయి. ఆన్లైన్ యాప్ల సాయంతో పెట్టుబడులు స్వీకరించి, అధిక లాభాలు, విదేశీ టూర్ల ప్రలోభాలతో ప్రజలను ఆకర్షిస్తున్నాయి. డాలర్ల రూపంలో ఆదాయం, కొత్త సభ్యులను చేర్చితే అదనపు కమీషన్, టార్గెట్ పూర్తి చేసిన వారికి దుబాయి, బాలీ, సింగపూర్, మలేషియా, థాయ్లాండ్ టూర్ ఆఫర్లు ఇస్తూ గాలం వేస్తున్నారు. ఈక్రమంలో పదుల సంఖ్యలో ఉన్న ఇన్వెస్టర్లు ఇప్పుడు వేలల్లోకి చేరగా, పలువురు ఇళ్లు, బంగారం, బాండ్లు పెట్టి కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు.
మెటాఫండ్ ప్రో పెట్టుబడులపై కేసులు
హైదరాబాద్కు చెందిన వారాల లోకేశ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్, పిరమిడ్ స్ట్రక్చర్ స్కీంల పేరిట ఓ యాప్ క్రియేట్ చేశాడు. వీటిలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలొస్తాయని ఆన్లైన్లో ప్రకటనలిచ్చాడు. దీంతోపాటు కస్తూరి రాకేశ్, సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, వీరబత్తిని రాజుల ద్వారా జగిత్యాల జిల్లాలో పలువురిని చైన్ సిస్టం ద్వారా చేర్చుకున్నారు. ఇలా మెటా ఫండ్ ప్రో యాప్లో కొడిమ్యాలకు చెందిన ఓ మహిళ రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టింది. ఎలాంటి లాభాలు రాకపోవడంతో సదరు మహిళ ఈనెల 9న కొడిమ్యాల పీఎస్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు ఏ-1 కస్తూరి రాకేశ్ కుమార్ తో పాటు ఏ-2 సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, వీరబత్తిని రాజును అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. దీంతో పెట్టుబడి పెట్టిన మరికొంతమంది నష్టపోయామని గ్రహించి పోలీస్స్టేషన్లకు క్యూ కట్టారు.
ఈ నెల 11న శనివారం రాత్రి రూ. 80.50 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటనలో జగిత్యాలకు చెందిన మరో బాధితుడి ఫిర్యాదు మేరకు మెట్ ఫండ్ ప్రో యాప్ నిర్వహుకుడు వారాల లోకేశ్, అతని తండ్రి వెంకటేశ్వరరావు, కస్తూరి రాకేశ్ సోదరుడు శ్యామ్పై జగిత్యాల పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. యాప్ నిర్వహుకుడు వారాల లోకేష్ పరారీలో ఉండగా, మిగతా ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. గతేడాది అక్టోబర్లో జగిత్యాల పోలీస్స్టేషన్లో రెక్సోస్ పేరిట మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసం చేసిన ఐదుగురిపై టీఎస్పీడీఎఫ్ఈ యాక్ట్ సహా పలు చట్టాల కింద కేసు నమోదయింది.
ఈడీ నజర్
ఆర్బీఐ రూల్స్కు విరుద్ధంగా మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది. ఇప్పటికే కేసు వివరాలపై పోలీసుల నుంచి నివేదికను తెప్పించుకుంది. దాదాపు రూ. 60 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టించిన కీలక సూత్రధారులపై కేసు నమోదు కావడంతో బాధితులు ఒక్కొక్కరు గా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. తాజాగా జగిత్యాలలో నమోదైన కేసుపై కూడా ఈడీ సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరిట ఇన్వెస్ట్ చేసిన ప్రముఖులతో పాటు విదేశీ టూర్లకు వెళ్లిన వ్యక్తులపై కూడా పోలీసులు నిఘా పెట్టారు.