- సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో రూ. 13.10 కోట్ల బిల్లులు పెండింగ్
- నాలుగేండ్లుగా కరెంట్ బిల్లులు చెల్లించని పాలకవర్గాలు
- నోటీసులు ఇచ్చి వదిలేస్తున్న సెస్
రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోతున్నాయి. పాలకవర్గాలు నాలుగేండ్లుగా విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో సుమారు రూ.13.10కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి.
ఈ మున్సిపాలిటీలతో జిల్లావ్యాప్తంగా 260 గ్రామాలకు సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) ఎన్పీడీసీఎల్ నుంచి కరెంట్ కొని సప్లై చేస్తోంది. సెస్ వీటి నుంచి బిల్లులు వసూలు చేసి ఎన్పీడీసీఎల్కు చెల్లించాల్సి ఉంటుంది. కాగా బల్దియాల నుంచి బిల్లులు వసూలు కాకపోవడంతో సెస్ సైతం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది.
పేరుకుపోతున్న బకాయిలు
వేములవాడ మున్సిపాలిటీ నాలుగేండ్లుగా సుమారు రూ.5.55కోట్లు విద్యుత్ శాఖకు చెల్లించాల్సి ఉంది. సిరిసిల్ల మున్సిపాలిటీ రూ.7.55 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. బిల్లులు చెల్లించాలని సెస్ మున్సిపాలిటీలకు నోటీసులు జారీ చేస్తోంది. స్పందించకపోవడంతో రెండు, మూడు సార్లు కరెంట్ కట్ చేసింది. ఇలా కట్ చేసినప్పడల్లా బల్దియా పాలకవర్గాలు రూ.రెండు మూడు లక్షలు చెల్లించి వదిలేస్తున్నాయి.
నోటీసులు తప్ప చేసేదేమీలేదు?
ఈ రెండు మున్సిపాలిటీలకు విద్యుత్ బిల్లులు చెల్లించాని సెస్ నోటీసులు ఇవ్వడం తప్ప చేసేదేమీలేదన్న ఆరోపణలున్నాయి. పాలకవర్గాలకు రూ.కోట్లలో పన్నులు వచ్చినా కరెంట్ బిల్లులు చెల్లించడంలేదు. దీంతో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోతున్నాయి.
పదేండ్లుగా సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలకు, సెస్కు కూడా ఒకే పార్టీకి చెందిన వారే పాలకవర్గాలుగా ఉండడంతో మెతక వైఖరి అవలంభిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సాధారణ ప్రజలు బిల్లులు చెల్లించకపోతే కరెంట్ కట్ చేసే సెస్.. మున్సిపాలిటీ ఆఫీసుల పట్ల ఎందుకు ఉదాసీనత కనబరుస్తోందని విమర్శలూ ఉన్నాయి.
రూ.కోట్లలో బకాయిలు ఉన్నాయి..
సెస్ పరిధిలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో విద్యుత్ బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. ఏండ్లుగా నోటీసులు ఇస్తున్నా పూర్తిస్థాయిలో బకాయిలు చెల్లించడంలేదు. ఈ సారి కూడా నోటీసులు ఇస్తాం బకాయిలు చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు
