- రాజన్నసిరిసిల్ల జిల్లాలో నిత్యం తనిఖీలు
- 10 నెలల్లో పది వేల మందికి రూ.93లక్షల ఫైన్
- 232 మంది జైలు పాలు
రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసులు తాగి వాహనాలు నడుపుతున్నవారిపై నజర్ పెట్టారు. నిత్యం స్పెషల్ తనిఖీలు చేపడుతూ డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్లు చేస్తున్నారు. ఒక్కసారి దొరికితే ఫైన్ వేస్తుండగా.. రెండోసారి దొరికితే జైలుకే పంపుతున్నారు. జిల్లాలో 10 నెలల్లో తాగి బండి నడిపిన పది వేల మంది పట్టుబడగా.. వారిలో కోర్టు కొందరికి ఫైన్లు వేయగా.. మరికొందరికి జైలు శిక్ష విధించింది.
పది నెలల్లో 10 వేల మందికి ఫైన్
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా సాయంత్రం సిరిసిల్ల శివారు ప్రాంతాలైన రగుడు, పెద్దూరు, తంగళ్లపల్లి బ్రిడ్జి వద్ద స్పెషల్ డ్రైవ్లు చేపడుతున్నారు. దీంతోపాటు గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, చందుర్తి, బోయినిపల్లి, కోనరావుపేట, వేములవాడ మండలాల్లోనూ ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ పది నెలల్లో 10,980 మందిని డ్రంకెన్ డ్రైవ్లో పట్టుకున్నారు. వీరికి రూ.92,93,949 ఫైన్ విధించారు.
వీరిలో రెండోసారి దొరికి 232 మంది జైలుపాలయ్యారు. రోడ్డు ప్రమాదాల నివారణకే డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. డ్రంకెన్ డ్రైవ్లో ఫస్ట్ సారి దొరికితే బైక్ నడిపే వారికి రూ.వెయ్యి, ఫోర్ వీలర్ అయితే రూ.5వేలు ఫైన్ వేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
పెద్దపల్లి జిల్లాలో రూ.73.62 లక్షల ఫైన్
గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లాలో మందుబాబులపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. గోదావరిఖని, పెద్దపల్లిలోని ట్రాఫిక్ పోలీసులతో పాటు జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో మందు తాగి వాహనాలు నడిపిన వారి పట్ల కఠినంగా వ్యవహరించారు. ప్రత్యేకంగా రాజీవ్ రహదారిపై బ్రీత్ అనలైజర్తో డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్లు చేస్తున్నారు. 2025 జనవరి 1 నుంచి నవంబర్ 12వరకు 8,524 మందిపై డ్రంకెన్డ్రైవ్లు కేసులు నమోదవగా.. వీరిలో 5,655 మంది కోర్టుకు హాజరయ్యారు. వీరికి జిల్లాలోని ఆయా కోర్టులు రూ.73.62 లక్షల ఫైన్ విధించాయి. కాగా మద్యం తాగి వెహికిల్స్ నడిపిన వారిలో రెండు సార్లు పట్టుబడిన వారిలో 25 మందికి మూడు రోజులు, ఇద్దరికి ఐదు రోజుల పాటు జైలు శిక్ష విధించారు. అలాగే సామాజిక శిక్షలో భాగంగా హాస్పిటళ్లు,, స్కూళ్లు, ప్రభుత్వ ఆఫీస్ ప్రాంగణాల వద్ద చెత్తను, పిచ్చి మొక్కలను తొలగింపచేసేలా పనులు చేయించారు.
యాక్సిడెంట్ల నివారణకే డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్లు
తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే చాన్స్ ఉంది. యాక్సిడెంట్ల నివారణకే డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్లపై ఫోకస్ పెట్టాం. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో టెస్ట్లను ముమ్మరం చేశాం. మొదటిసారి తాగి పట్టుబడితే పోలీస్స్టేషన్లో కౌన్సెలింగ్ ఇస్తున్నాం. కోర్టులో హాజరుపరిచి ఫైన్లు విధిస్తున్నాం. రెండోసారి పట్టుబడితే జైలు తప్పదు. -మహేశ్ బి.గీతే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల జిల్లా
