వానలు కురిసి నిండుకుండల్లా మారిన చెరువులు ఓవైపు. అందమైన పూలతో పలకరించే చెట్లు మరోవైపు. ఇలా తీరొక్క పూలతో ప్రకృతిని కొలిచే పూల పండుగలో నాలుగవరోజు (ఆశ్వయుజ తృతీయ) నానబియ్యం బతుకమ్మగా గౌరమ్మను కొలుస్తారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి లాంటి తీరొక్క పూలతో నాలుగంతరాల బతుకమ్మ పేరుస్తారు. శిఖరంపై పసుపుతో తయారుచేసిన గౌరమ్మను ఉంచుతారు. ఉదయం అమ్మవారికి పూజలు చేసి, సాయంత్రం గంగమ్మ ఒడికి చేరుస్తారు. నాలుగవరోజు వాయనంగా నానబెట్టిన బియ్యాన్ని బెల్లం లేదా చక్కెరతో కలిపి ముద్దలుగా తయారుచేసి పంచుతారు.
ప్రసాదం:
కావాల్సినవి: బియ్యం– ఒక కప్పు,
పాలు– మూడు కప్పులు,
నీళ్లు– ఒక కప్పు,
బెల్లం– ఒక కప్పు,
నెయ్యి– కొద్దిగా,
డ్రై ఫ్రూట్స్– కొద్దిగా
తయారీ
బియ్యం కడిగి కొంచెంసేపు నాన బెట్టాలి. తర్వాత ఒక గిన్నెలో బియ్యం, పాలు, నీళ్లు పోసి ఉడికించాలి. ఇంకో గిన్నెలో బెల్లం వేసి, కొన్ని నీళ్లు పోసి కరిగించి చల్లార్చాలి. ఆ తర్వాత ఉడికిన బియ్యంలో బెల్లం పాకాన్ని పోసి కలపాలి. కడాయిలో నెయ్యి కరిగించి డ్రై ఫ్రూట్స్ వేగించాలి. వీటితో గార్నిష్ చేస్తే నానబియ్యం ప్రసాదం రెడీ.