మీ పిల్లలకు ఇలాంటి ఆహారం పెడతారా : సర్కార్ స్కూళ్లల్లో గడువు తీరిన ఫుడ్ పై కాక్రోచ్ పార్టీ

మీ పిల్లలకు ఇలాంటి ఆహారం పెడతారా : సర్కార్ స్కూళ్లల్లో గడువు తీరిన ఫుడ్ పై కాక్రోచ్ పార్టీ

దేశంలోని ప్రభుత్వ స్కూల్స్ లో ఏం జరుగుతుంది.. స్కూల్స్ ఎలా ఉన్నాయి.. ఆ స్కూల్స్ లో పిల్లలకు పెడుతున్న ఆహారం ఎలా ఉంది.. ఈ అంశాలపై కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమం ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తుంది. ఓ ప్రభుత్వ స్కూల్ ను పరిశీలించిన కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే.. అక్కడ పిల్లలకు అందిస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించారు. ఆయా ప్యాకెట్లపై ఎక్స్పయిరీ డేట్ ఉండటంతో షాక్ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద పిల్లలకు పెడుతున్న ఇదే ఆహారాన్ని.. మీ పిల్లలకు పెడతారా అంటూ అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రశ్నించిన తీరు.. ఇప్పుడు సోషల్ మీడియాను కదిలిస్తుంది.

ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు ఎలాంటి ఆహారం అందిస్తున్నారో చూడండి అంటూ 2026 ఆగస్టు 29న ఎక్స్ లో వీడియో పోస్ట్ చేశారు అభిజీత్ దీప్కే. స్కూల్ ఠీక్ కరో ప్రచారం మొదలుపెట్టిన సీజేపీ.. మొదటగా మహారాష్ట్ర పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు. స్కూల్ కిచెన్ లో తనిఖీలు నిర్వహించిన దీప్కే బృందం.. సర్కారు బడులల్లో పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయో చూడాలంటూ వీడియో పోస్ట్ చేశారు. 

మీ పిల్లలకు అయితే ఇలాంటి ఆహారమే తినిపిస్తారా..? మేము ఈ నిర్లక్ష్యాన్ని బయట పెడుతున్నందుకు మాపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా.. అయితే చేయండి.. మేము నిజాన్ని బయటపెట్టకుండా ఉండము .. అంటూ వీడియోలో పేర్కొన్నారు. 

కాలం చెల్లిన ఆహార పదార్థాలు:

వీడియోలో ఎక్స్ పైరీ అయిపోయిన ప్యాకెట్ ను చూపిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు దీప్కే. 2025 ఆగస్టు లో ప్యాక్ చేసిన మసాలా 2026 ఫిబ్రవరి వరకే వాడుకోవాలని ఎక్స్ పైరీ డేట్ ముద్రించి ఉంది. దీన్ని చూపిస్తూ.. గ్రామీణ ప్రాంతాల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలను పిల్లలకు తినిపిస్తున్నారని అన్నారు. 

స్కూల్ ఠీక్ కరో ప్రచారంలో భాగంగా దీప్కే, సీజేపీ సభ్యులతో కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల దయనీయ స్థితిని బయటపెడుతూ.. స్కూళ్లు బాగు చేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది సీజేపీ. చాలా స్కూళ్లలో కనీస సౌకర్యాలు లేవని, మౌలిక సదుపాయాలు దారణంగా ఉన్నాయని.. వాష్ రూమ్స్ కూడా లేకపోతే పిల్లల పరిస్థితి ఏంటని ఈ సందర్భంగా దీప్కే ప్రశ్నించారు.

 మహారాష్ట్రలో చాలా మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి మైళ్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని దీప్కే గుర్తించారు.  వారి గ్రామాల్లో పాఠశాలలు లేకపోవడమే కాకుండా, మరోవైపు సరైన రవాణా సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు. అందువల్ల, సీజేపీ ప్రచారం కేవలం తరగతి గదుల్లో ఏం జరుగుతుందనే దానిపైనే కాకుండా, పిల్లలు తమ పాఠశాలలకు సురక్షితంగా చేరుకోగలరా..? అక్కడికి చేరుకున్న తర్వాత వారికి ప్రాథమిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అనే దానిపై కూడా దృష్టి సారించింది. 

దేశం మొత్తం డేటా కలెక్షన్:

సీజేపీ దేశవ్యాప్త డేటా సేకరణకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ప్రచారం ద్వారా, ఒక పాఠశాలలో ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయో లేదో కన్ఫామ్ చేసుకునేందుకు ఒక చెక్‌లిస్ట్‌ను రూపొందించుకోవాలని.. విద్యార్థుల   తల్లిదండ్రులను, ప్రభుత్వ అధికారులను దీప్కే కోరారు.