హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ శుక్రవారం మరోసారి షోకాజ్ నోటీసు పంపింది. గత నెల 22న కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసు పంపుతూ 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. ఆ గడువు ఈ నెల 1వ తేదీతో ముగిసినా ఆయన నుంచి సమాధానం రాలేదు. దీంతో ఏఐసీసీ వర్గాలు కోమటిరెడ్డి ఆఫీస్ను సంప్రదించగా.. ఆయన విదేశీ టూర్లో ఉండడంతో నోటీసు చేరలేదని తెలిపాయి. దీంతో మరోసారి నోటిస్ ఇష్యూ చేశారు.
ఎంపీ కామెంట్స్పై హైకమాండ్ సీరియస్
మునుగోడు బై పోల్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ కార్యకర్తకు ఎంపీ ఫోన్ చేసి కోరారు. ఆ ఆడియో వైరల్ అయింది. ఆస్ట్రేలియా పర్యటనలోనూ వెంకటరెడ్డి అక్కడి వాళ్లతో మాట్లాడుతూ..మునుగోడులో కాంగ్రెస్ గెలవదని, తాను ప్రచారం చేసినా 10 వేల ఓట్లు ఎక్కువ వస్తయి కానీ ఫలితం ఉండదని అన్నారు. ఈ క్లిప్పింగ్ కూడా అధిష్టానానికి చేరింది. ఈ రెండు ఘటనలపై సీరియస్ అయిన హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
రాహుల్ యాత్రకూ దూరం
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గత నెల 23 నుంచి రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ యాత్రకు సైతం కోమటిరెడ్డి దూరంగా ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటన పూర్తి చేసుకుని ఈ నెల 2న ఆయన హైదరాబాద్ వచ్చారు. కానీ రాహుల్ యాత్రలో పాల్గొనలేదు. ఈ నెల 7 వరకు రాష్ట్రంలో యాత్ర కొనసాగనుంది. ఆ లోపు రాహుల్ను వెంకటరెడ్డి కలుస్తారా, లేదా అన్నది చర్చనీయాశంగా మారింది.