హైదరాబాద్, వెలుగు: అమర రాజా గ్రూప్లోని అమర రాజా ఇన్ఫ్రా కంపెనీకి బంగ్లాదేశ్ నుంచి 130 మిలియన్ డాలర్ల విలువైన సోలార్ ప్రాజెక్టు లభించింది. దీంతో ఇంటర్నేషనల్ సోలార్ మార్కెట్లోకి అడుగుపెట్టినట్లవుతుందని అమర రాజా ఒక స్టేట్మెంట్లో తెలిపింది. ఇంజినీరింగ్, డిజైన్, సప్లయ్, ఇన్స్టలేషన్ పనులను ఈ ప్రాజెక్టు కింద నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. 100 మెగావాట్ల కెపాసిటీతో నెలకొల్పే ఈ సోలార్పవర్ ప్లాంట్కు ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిధులు సమకూరుస్తోందని వెల్లడించింది. బంగ్లాదేశ్లోని రూరల్ పవర్ కంపెనీ లిమిటెడ్ నుంచి హైదరాబాద్కే చెందిన మరో కంపెనీ ప్రీమియర్ సోలార్తో కలిసి ఈ కొత్త ఆర్డరు చేజిక్కించుకున్నామని పేర్కొంది.
జమల్పుర్ జిల్లాలోని మదర్గంజ్ వద్ద 326 ఎకరాల విస్తీర్ణంలో సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని, తర్వాత ఆపరేషన్, మెయింట్నెన్స్ సేవలను కూడా అందించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇండస్ట్రీలోని పెద్ద కంపెనీలతో పోటీ పడి బంగ్లాదేశ్ ప్రాజెక్టు దక్కించుకోవడం గర్వకారణంగా భావిస్తున్నామని అమర రాజా ఇన్ఫ్రా డైరెక్టర్ విక్రమాదిత్య గౌరినేని ఈ స్టేట్మెంట్లో చెప్పారు.