రాజమండ్రిలో పవన్ కళ్యాణ్, లోకేష్ సోమవారం( అక్టోబర్ 23) చేసిన వ్యాఖ్యలకు వైసీపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. రాజమండ్రిలో టీడీపీ, జనసేన ల మీటింగ్ అట్టర్ ఫ్లాఫ్ అయిందన్నారు. సున్నా... సున్నా కలిస్తే సున్నాయే వస్తుందన్నారు. లోకేష్ పల్లకి మోయడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశారన్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీతో కొత్తగా కలిశారా అని ప్రశ్నించారు. ప్యాకేజీ స్టార్ కాబట్టే నీ విధానాన్ని తప్పు బడుతున్నామన్నారు. 2014లో కలిసి పోటీ చేశావ్… 2019లో విడిగా పోటీ చేశావ్.. ఏం చేసినా చంద్రబాబుకు ప్రయోజనం కలిగించటమే పవన్ లక్ష్యమని మంత్రి అన్నారు. చంద్రబాబుకు మనో ధైర్యాన్ని ఇవ్వటం కోసం..టీడీపీ కోసమే పుట్టిన పార్టీ జనసేన అని మంత్రి అంబటి విమర్శించారు. చంద్రబాబుకు తాము బెయిల్ రాకుండా చేస్తున్నామా అని మండిపడ్డారు.
Also Read :- మిజోరం బరిలో 174 మంది అభ్యర్థులు
పవన్ కళ్యాణ్ కు వ్యవస్థ పై అవగాహన ఉందా అని వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. కేసు స్ట్రాంగ్ గా ఉండటం వల్లే ఏ కోర్టులోనూ రిలీఫ్ దొరకటం లేదని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వస్తారని మొదటి రోజు నుంచే చెబుతున్నామని.. తాము చెప్పిందే జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత మంది పై కేసులు పెట్టినా బాధ అనిపించ లేదా అని ప్రశ్నించారు. పవన్ కు సొంత ఆలోచనా విధానమే లేదని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. మూడేళ్ళ కిందటే చంద్రబాబు పల్లకిని పవన్ కళ్యాణ్ మోస్తాడని చెప్పామని.. అమిత్ షా పిలిస్తేనే వెళ్ళానని లోకేష్ చెప్పాడన్నారు.
ఎంత మంది కలిసినా జగన్ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరని మంత్రి అంబటి అన్నారు. వారి మ్యానిఫెస్టో రాష్ట్రాన్ని కాపాడే విధంగా ఉంటుందో, టీడీపీని కాపాడే విధంగా ఉంటుందో చూద్దామన్నారు. జైల్లో ఉండే ప్రతి వాడు ప్రజల గుండెల్లో ఉండరని తెలిపారు. టీడీపీనే రాష్ట్రానికి పట్టిన తెగులు అని విమర్శించారు. బయటకు వస్తే సాక్ష్యాధారాలు బయటపడతాయనే చంద్రబాబును రిమాండ్ లో ఉంచారని మంత్రి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ద్వారా ఓటు కొనాలని ప్రయత్నించి చంద్రబాబు అడ్డంగా దొరికిపోయిన విషయం అందరికి తెలిసిందే కదా అని అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయటం కోసమే 17ఏ మీద పోరాడుతున్నాడని.. చంద్రబాబు దొరికిన దొంగ అని విమర్శించారు. చంద్రబాబు లోపల ఊసలు లెక్క పెట్టుకోవటం, బయట లోకేష్ రోజులు లెక్క పెట్టుకోక తప్పదని మంత్రి అంబటి తెలిపారు