
- ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న నిఫ్టీ
- ఇక నెక్స్ట్ స్టాప్ 21 వేలు అంటున్న ఎనలిస్టులు
- రూ.5.81 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
ముంబై : కీలకమైన రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో మార్కెట్ ఫుల్ జోష్లో కదిలింది. బెంచ్మార్క్ ఇండెక్స్లు సోమవారం ఆల్ టైమ్ గరిష్టాలను నమోదు చేశాయి. దేశంలో రాజకీయపరంగా ఎటువంటి అనిశ్చితులు నెలకొనవని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. బెంచ్మార్క్ ఇండెక్స్ నిఫ్టీ సోమవారం ఏకంగా 418 పాయింట్లు (2.07 శాతం) పెరిగి 20,686 దగ్గర క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఈ ఇండెక్స్ 20,703 వరకు పెరిగి ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. ఇంట్రాడేలో 68,918 దగ్గర జీవిత కాల గరిష్టాన్ని రికార్డ్ చేసిన సెన్సెక్స్, చివరికి 1,383 పాయింట్ల లాభంతో 68,865 దగ్గర సెటిలయ్యింది. ఈ ఒక్క సెషన్లోనే ఇన్వెస్టర్ల సంపద రూ.5.81 లక్షల కోట్లు పెరిగింది. సెక్టార్ల పరంగా చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా 3 శాతానికి పైగా లాభపడి 46,484 లెవెల్ దగ్గర ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. నిఫ్టీ మీడియా, ఫార్మా ఇండెక్స్లు మినహాయించి మిగిలిన అన్ని సెక్టార్ల ఇండెక్స్లు సోమవారం పాజిటివ్గా క్లోజయ్యాయి. నిఫ్టీ 19,850 లెవెల్ను దాటాక మార్కెట్ భారీగా పెరుగుతుందని ట్రేడర్లు ఊహించారని, అందుకే హయ్యర్ లెవెల్లో పుట్ పొజిషన్లు (సెల్లింగ్) భారీగా తీసుకుంటున్నారని ఎల్కేపీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ రూపక్ అన్నారు. నిఫ్టీ 20,400 దిగువకు రానంత వరకు 21 వేల లెవెల్ను టచ్ చేస్తుందని అన్నారు.
అదానీ షేర్లు జూమ్
అదానీ గ్రూప్ షేర్లు సోమవారం సెషన్లో భారీగా పెరిగాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 7 శాతం, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ 6 శాతం, అదానీ పవర్ 6 శాతం లాభపడ్డాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 5 శాతం పెరగగా, అదానీ గ్రీన్ ఎనర్జీ మాత్రం 9 శాతం ర్యాలీ చేసింది. అదానీ టోటల్ గ్యాస్ 4 శాతం, అదానీ విల్మార్ 2 శాతం లాభపడ్డాయి. అంబుజా సిమెంట్స్ షేర్లు సోమవారం 7 శాతం పెరిగాయి.
మార్కెట్ ఎందుకు పెరిగిందంటే?
1. బీజేపీ మాయ
రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు దక్కించుకుంది. దీంతో రానున్న పార్లమెంటరీ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుస్తుందనే అంచనాలు ఎక్కువయ్యాయి. రాజకీయ అనిశ్చితి నెలకొనదని ఎనలిస్టులు భావిస్తున్నారు. ‘రాష్ట్రాల ఎన్నికలు మార్కెట్కు పెద్ద ఈవెంట్గా మారాయి. ఎన్నికల ఫలితాలు ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ పెంచింది. మార్కెట్ మరింత పెరుగుతుంది. రాజకీయ స్థిరత్వం, సంస్కరణలకు పెద్ద పీట వేసే ప్రభుత్వాలనే మార్కెట్ కోరుకుంటుంది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు. మార్కెట్ మూమెంటం చూస్తుంటే నిఫ్టీ 20,800 వరకు పెరిగే ఛాన్స్ కనిపిస్తోందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన దానికంటే భిన్నంగా రిజల్ట్స్ వచ్చాయని, బీజేపీకి ఫేవర్గా ఉన్నాయని బ్రోకరేజ్ కంపెనీ జెఫరీస్ పేర్కొంది. వచ్చే ఏడాది జనరల్ ఎలక్షన్స్లో మోదీ మరోసారి గెలుస్తారనే అంచనాలు పెరిగాయని తెలిపింది. దేశంలోకి విదేశీ ఇన్వెస్ట్మెంట్లు రావడం పెరుగుతుందని ఫిలిప్ క్యాపిటల్ వెల్లడించింది.
2. పాజిటివ్గా గ్లోబల్ మార్కెట్లు..
గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్గా ట్రేడవ్వడం కూడా మన మార్కెట్లకు కలిసొచ్చింది. యూఎస్ మార్కెట్లు శుక్రవారం (డిసెంబర్ 1 న) ర్యాలీ చేశాయి. ఈ ఎఫెక్ట్ గ్లోబల్ మార్కెట్లపై సోమవారం పడింది. అన్నిటికంటే యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్, ఆయిల్ ధరలు, డాలర్ ఇండెక్స్ తగ్గడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను మెరుగుపరిచాయని విజయ కుమార్ అన్నారు.
3. వడ్డీ రేట్లు తగ్గించే ఆలోచన!
ఇన్ఫ్లేషన్ దిగొస్తుండడంతో వడ్డీ రేట్లను యూఎస్ ఫెడ్ ఇక పెంచదని మార్కెట్ అంచనా వేస్తోంది. ఈ నెల 12–13 న జరిగే ఫెడ్ పాలసీ మీటింగ్లో రేట్ల పెంపు ఉండదని ఎనలిస్టులు చెబుతున్నారు. అంతేకాకుండా వచ్చే ఏడాది మధ్య నుంచి వడ్డీ రేట్లు తగ్గిస్తుందని అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ ఎంపీసీ కూడా ఈ నెల 6–8 మధ్య జరిగే పాలసీ మీటింగ్లో వడ్డీ రేట్లను హోల్డ్లో పెడుతుందని నమ్ముతున్నారు.
4. ఎఫ్ఐఐల రిటర్న్
వరుసగా మూడు నెలల పాటు నికర అమ్మకందారులుగా కొనసాగిన ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) నవంబర్ చివరిలో నెట్ బయ్యర్లుగా మారారు. కిందటి నెలలో నికరంగా రూ.5,795 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. శుక్రవారం నికరంగా రూ.1,589.61 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.
511 రెట్లు సబ్స్క్రయిబ్ అయిన నెట్ ఎవెన్యూ ఐపీఓ
ఎస్ఎంఈ ఐపీఓకి వచ్చిన నెట్ అవెన్యూ టెక్నాలజీస్ ఏకంగా 511 రెట్లు సబ్స్క్రిప్షన్ సాధించింది. కంపెనీ ఐపీఓ కిందటి నెల 30 న ఓపెన్ అవ్వగా సోమవారం ముగిసింది. ఈ పబ్లిక్ ఇష్యూలో 37,92,000 షేర్లను కంపెనీ అమ్మకానికి పెట్టింది. ఏకంగా 194 కోట్ల షేర్ల కోసం బిడ్స్ వచ్చాయి. ఐపీఓలో షేరును రూ.16–18 కి నెట్ అవెన్యూ అమ్మకానికి పెట్టింది. ఈ ఎస్ఎంఈ ఐపీఓ ద్వారా రూ.10.25 కోట్లు సేకరించింది. కంపెనీ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన షేర్లు 616 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 721.68 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 62 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి. డిసెంబర్ 7 న కంపెనీ షేర్లు లిస్ట్ కానున్నాయి.