హైదరాబాద్, వెలుగు: న్యాయవాదుల సంక్షేమ నిధి (అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్)లో చేరడానికి 35 నుంచి 65 ఏండ్ల వారికి ఒక్క అవకాశం కల్పించాలని బార్ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ మేరకు అక్టోబరు 18న బార్ కౌన్సిల్ సమావేశం తీర్మానించింది. వయస్సుల వారీగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యే సమయంలో న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ.3,500 వసూలు చేసి సభ్యత్వం కల్పిస్తారు.
న్యాయవాద వృత్తిలో ఉంటూ సంక్షేమ నిధిలో సభ్యత్వం తీసుకోనివారికి అవకాశం కల్పించాలని బార్ అసోసియేషన్లు, న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి శుక్రవారం వెల్లడించారు. బార్ కౌన్సిల్ నిర్ణయించిన మొత్తాన్ని నవంబరు 1 నుంచి డిసెంబరు 31లోగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.
