
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బతకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ వేడుకకు ఢిల్లీలోని తెలంగాణ ప్రజలతో పాటు ఉత్తరాదికి చెందిన మహిళలు, మహిళా ఉన్నతాధికారులు పాల్గొని, బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు. అలాగే, ముఖ్య అతిథిగా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డితో పాటు కేంద్ర ప్రాజెక్టులు, పథకాల సమన్వయకర్త గౌరవ్ ఉప్పల్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయెల్, భవన్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో వివిధ రకాల పూలతో ప్రకృతిని పూజించే ఏకైక పండుగ మన బతుకమ్మ అని అన్నారు. బతుకమ్మ తెలంగాణ బిడ్డలందరీ జీవితాల్లో వెలుగు నింపే పండుగ అని అన్నారు. ఈ పండుగ మహిళా శక్తిని, ఐక్యతను చాటిచెబుతుందని తెలిపారు.