
వీపనగండ్ల, వెలుగు: చిన్నంబావి మండలం ఏర్పడి తొమ్మిదేండ్లు కావస్తున్నా, కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక దృష్టి పెట్టి సౌలతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం చిన్నంబావిలో అద్దె భవనంలో నడుస్తున్న తహసీల్దార్ ఆఫీస్ను సందర్శించి, తహసీల్దార్ తో మాట్లాడారు. అనంతరం సంత జరిగే ప్రాంతాన్ని పరిశీలించి, వ్యాపారులు, ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ కూడా కాని చిన్నంబావిని మండలం చేశారని, సౌలతులు కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. వెంటనే ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ను నిర్మించాలని కోరారు.
ఇక్కడి దేవాదాయ భూములను ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు కబ్జా చేస్తున్నారనే ఆరోపణలున్నాయని, దీనిని అరికట్టేందుకు దేవాదాయ శాఖ భూములను సర్వే చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, బస్టాండ్ నిర్మించాలని కోరారు. సంతకు వచ్చే వ్యాపారులు, ప్రజలకు సౌలతులు కల్పించాలన్నారు. వీవీ గౌడ్, బత్తుల జితేందర్, రాఘవేందర్ గౌడ్, నాగరాజు, యశ్వంత్, విజయ్ పాల్గొన్నారు.