
- పీసీసీ చీఫ్పై బీజేపీ ఎమ్మెల్యేల ఆరోపణలు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్లో కేసీఆర్ కోవర్ట్ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడేనని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఆదివారం ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, రామారావు పటేల్, పైడి రాకేశ్ రెడ్డి, పాల్వాయి హరీశ్ రావు ఓ సంయుక్త ప్రకటన రిలీజ్ చేశారు. 2014 లోక్సభ ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి కవితకు మహేశ్ గౌడ్ పరోక్షంగా మద్దతిచ్చారని తెలిపారు. ఎంపీ ఈటల రాజేందర్ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు ఆయన కట్టుకథలతో కుట్రలు పన్నుతున్నారని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ ముందు హాజరయ్యే విషయంలో ఈటల రాజేందర్, హారీశ్ రావు శామీర్ పేటలోని ఓ ఫామ్ హౌస్లో భేటీ అయ్యారని, కేసీఆర్ తో మాట్లాడారని పీసీసీ చీఫ్ నిరాధార ఆరోపణలు చేశారని తెలిపారు. వారిద్దరు ఎక్కడ భేటీ అయ్యారనే ఆధారాలు 24 గంటల్లో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే తప్పును ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలని కోరారు. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కాళేశ్వరం, మిషన్ భగీరథ, ధరణి పోర్టల్, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఈ కార్ రేసింగ్, తదితర అంశాలపై సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు.