సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. తన ప్రేమను నిరాకరించిందనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తానూ కత్తితో పొడుచుకున్నాడు. యాప్రాల్ బాలాజీ నగర్కు చెందిన గిరీష్, బాపూజీ నగర్కు చెందిన చామంతికి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కొద్ది రోజులు క్రితమే మనస్పర్థలు వచ్చి విడిపోయారు. అయినా తాను ప్రేమిస్తున్నానని..పెళ్లి చేసుకోవాలని వెంటపడుతున్నాడు గరీష్.
చామంతి స్థానికంగా ఉన్న ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తుంది. ఈ క్రమంలో తనను ప్రేమించడం లేదనే కోపంతో ఇవాల(బుధవారం) యువతి ఇంటికి వెళ్లిన గిరీష్.. ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి నడుం, చేతులపై గాయాలయ్యాయి. విషయాన్ని గమనించిన స్థానికులు ఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో భయానికిలోనైన.. గిరీష్ తనను తాను కత్తితో పొడుచుకున్నాడు. రక్తపు మడుగులో ఉన్న ఇద్దరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.