
- ఇల్లు మంజూరైందని చెప్పిన మీడియాకు శ్రీనివాస్
- పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నావని చర్యలు
- కరీంనగర్ జిల్లా కొండపల్కలలో ఘటన
కరీంనగర్/మానకొండూరు, వెలుగు: ఇందిరమ్మ ఇల్లు ఎట్లా తీసుకుంటావని, ఇది పార్టీ వ్యతిరేక చర్య అంటూ బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిని ఆ పార్టీ ఉన్నతస్థాయి నేతలు తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కొండపల్కల గ్రామానికి చెందిన బొల్లం శ్రీనివాస్ గౌడ్ సుమారు 15 ఏండ్లుగా బీఆర్ఎస్ లో ఉంటుండగా.. ఏడేండ్లుగా పార్టీ గ్రామ అధ్యక్షుడిగా ఉన్నారు. వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్ అయిన శ్రీనివాస్ కు 18 గుంటల అసైన్డ్ ల్యాండ్ తప్ప పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రోగ్రామ్స్ ఫొటోలు తీసేవాడు.
కాగా.. శ్రీనివాస్ కు డబుల్ బెడ్ రూమ్ కూడా రాలేదు. తన పెంకుటిల్లు శిథిలావస్థకు చేరడంతో గతేడాది ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేశాడు. గ్రామంలో రాజకీయాలకతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో శ్రీనివాస్ తోపాటు బీఆర్ఎస్ మహిళా నేత కొడుకు, బీజెపీ లీడర్లను ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు. కాగా.. ఇటీవల కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని, డబ్బులు తీసుకుని ఇచ్చారని రసమయి బాలకిషన్ ఆరోపణలు చేయడంతో పాటు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయితే.. బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బొల్లం శ్రీనివాస్ గౌడ్ తనకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని మీడియా ఎదుట ప్రకటించడంతో ఆ పార్టీ నేతలకు ఇబ్బందిగా మారింది.
దీంతో వెంటనే అతడు పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడంటూ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తాను గ్రామంలో నిరుపేదను, అర్హుడిని కాబట్టే తనకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని తెలిపారు. దీన్ని పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణించి సస్పెండ్ చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పడం, పార్టీ వ్యతిరేక చర్య ఎలా అవుతుంది..? అని ఆయన ప్రశ్నిస్తున్నాడు.