
హుజూరాబాద్ రూరల్/హుజూరాబాద్, వెలుగు: గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై విచారణ జరిపి వెంటనే సమస్యలు పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. బుధవారం హుజూరాబాద్ మండలం కనుకులగిద్దె జీపీ ఆఫీసులో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందన్నారు.
సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు పక్కాగా రికార్డు చేయాలని అన్నారు. అనంతరం హుజూరాబాద్ ఏరియా హాస్పిటల్ను సందర్శించారు. డయాలసిస్ కేంద్రం, ఐసీయూ, వార్డులు, ఓపీ విభాగం పరిశీలించారు. నవజాత శిశువుల వార్డు సందర్శించి పిల్లల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లేబర్ రూమ్, వార్డులు పరిశీలించి గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. అనంతరం హాస్పిటల్లోని కాన్ఫరెన్స్ హాల్లో వైద్యాధికారులు, డాక్టర్లతో రివ్యూ నిర్వహించారు.
ప్రభుత్వ హాస్పిటళ్లలో కాన్పుల సంఖ్య పెంచాలన్నారు. హుజూరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో ఆరోగ్య మహిళ క్యాంపును వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. అంతకుముందు హాస్పిటల్ ఆవరణలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో డీసీహెచ్ చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్వో చందు, సూపరింటెండెంట్ నారాయణరెడ్డి, ఆర్ఎంవో రమేశ్, శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, తహసీల్దార్ కనకయ్య, రెవెన్యూ సిబ్బంది, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
గొల్లపల్లి, వెలుగు: రైతుల భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఎండపల్లి, గొల్లపల్లి, వెల్గటూర్ మండలాల్లోని రెవెన్యూ సదస్సులను కలెక్టర్ సత్య ప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. రైతులు తమ భూ సమస్యల దరఖాస్తులతో పాటు సంబంధిత పత్రాలను సమర్పించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.