
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడంతోనే సరిపోదని, వాటిని వృక్షాలుగా పెరిగేలా సంరక్షించాల్సిన బాద్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టర్ ఆఫీసులో జిల్లా స్థాయి అధికారులతో వివిధ అంశాలపై రివ్యూ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వన మహోత్సవం కార్యక్రమం కింద మొక్కలు నాటే లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో మొక్కలు నాటే లక్ష్యం 58 లక్షలు కాగా ఇప్పటికి 63 శాతం మొక్కలు నాటి రాష్ట్రంలో 12 వ స్థానంలో నిలిచామన్నారు. మహబూబ్ నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాలిటీలలో మొక్కలు నాటే లక్ష్యం ఆశించిన మేరకు లేదని అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో 40 వేల ఈత మొక్కలు ఉన్నాయని, ఎక్సైజ్ శాఖ అధికారులు ఈత మొక్కలను నాటించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, నర్సింహా రెడ్డి, డి ఎఫ్. ఓ సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.