
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగర పరిధిలోని కాకతీయ యూనివర్సిటీ ఫిల్టర్ బెడ్, దేశాయిపేట ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్ ను ఆమె సందర్శించి నీటి సరఫరా తీరు, ఇతర వివరాలపై ఆరా తీశారు. కోర్ సిటీ తోపాటు విలీన గ్రామాలకు నీటిసరఫరా అయ్యే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సూచనలు చేస్తూ నీటి సరఫరాలో ఏమైనా లీకేజీలు ఏర్పడితే వెంటనే మరమ్మతులు చేపట్టి, ఆటంకం లేకుండా చూడాలని, వర్షాకాలం నేపథ్యంలో నీరు కలుషితం కాకుండా ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు.
అనంతరం గ్రేటర్ సిటీ వ్యాప్తంగా ఉన్న 21 డీఆర్ సీసీల నుంచి పొడి చెత్తలోని ప్లాస్టిక్ ఉత్పత్తులను వేరు చేసి, ఎప్పటికపుడు ప్లాస్టిక్ వ్యర్థాలను కంపెనీలకు పంపిస్తూ సెంట్రల్ హబ్ ను మరింత బలోపేతం చేయాలని, అదనంగా మరో రెండు యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. కమిషనర్ ఇన్ వార్డు ఔట్ వార్డుకు సంబంధించిన రికార్డ్స్ తో పాటు వేవింగ్ మిషన్ ను పరిశీలించారు. బాలసముద్రంలోని ఎస్సార్ డిగ్రీ కాలేజ్తో పాటు వరంగల్ పరిధి బజాజ్ ఎలక్ర్టానిక్స్లో ఆయా సంస్థలు ఏర్పాటు చేసిన అగ్నిమాపక యంత్రాల పనితీరును కమిషనర్ పరిశీలించారు.