- రాష్ట్రాలకు కేంద్రం గైడ్లైన్స్
- రాష్ట్రంలో షురువైన దరఖాస్తుల ప్రక్రియ
- తొలి రోజే ఐదొందల అప్లికేషన్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా డెత్ సర్టిఫికెట్ల కోసం అప్లికేషన్ల ప్రాసెస్ మంగళవారం షురూ అయ్యింది. మీ సేవ కేంద్రాల్లో అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మొదటిరోజే సుమారు 500 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారని అధికారులు తెలిపారు. కరోనాతో మరణించిన వ్యక్తి ఫ్యామిలీకి రూ.50 వేల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్స్గ్రేషియా కోసం అప్లై చేసుకోవాలంటే కేంద్రం చెప్పిన ఫార్మాట్లో డెత్ సర్టిఫికెట్ తప్పనిసరి అని చెప్పింది. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన కమిటీలు దరఖాస్తులను పరిశీలించి ఓడీఎఫ్సీ (అఫీషియల్ డాక్యుమెంట్ ఫర్ కొవిడ్ డెత్) మంజూరు చేస్తారు. ఓడీఎఫ్సీకి అప్లై చేసుకోవాలంటే గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ నుంచి తీసుకున్న డెత్ సర్టిఫికెట్, కరోనా పాజిటివ్ రిపోర్టు ఉండాలి. పాజిటివ్ రిపోర్టు లేకపోతే, మరణించిన వ్యక్తి ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్ ఇచ్చే ఎంసీసీడీ(మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్) సర్టిఫికెట్తో మీ సేవలో అప్లై చేసుకోవాలి. ఎంసీసీడీ లేకుంటే కరోనాకు ట్రీట్మెంట్ తీసుకున్న సమయంలో చేయించుకున్న స్కానింగ్, టెస్టుల రిపోర్టులు, మెడికల్ బిల్లులతో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డెత్ సర్టిఫికెట్తోపాటు ఈ మూడింటిలో ఏ ఒక్క సర్టిఫికెట్ లేదా మెడికల్ రిపోర్టు ఉన్నా ఓడీఎఫ్సీ ఇవ్వాలని కేంద్రం గైడ్లైన్స్లో పేర్కొంది. ఓడీఎఫ్సీ వచ్చిన తర్వాత ఎక్స్గ్రేషియా కోసం మరోసారి మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి. ఓడీఎఫ్సీ, మరణించిన వ్యక్తి ఫ్యామిలీ మెంబర్ బ్యాంక్ అకౌంట్ నంబర్, ఇతర ఆధారాలతో అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లై చేసుకున్న నెల రోజుల్లోపు అకౌంట్లో రూ.50 వేలు డిపాజిట్ అవుతాయి. కేంద్రం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం అందించనున్నాయి.
పాజిటివ్ రిపోర్టు లేకున్నా..
పాజిటివ్ రిపోర్టు లేకపోయినా కరోనాతో మరణించినట్టు డెత్ సర్టిఫికెట్ (ఓడీఎఫ్సీ) ఇవ్వాల్సిందేనని రాష్ట్రాలకు కేంద్రం చెప్పింది. దీంతో డెత్ సర్టిఫికెట్ల కోసం బాధిత కుటుంబాలు హాస్పిటళ్ల చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితులు ఉండటంతో కరోనా మృతులుగా ఎవరిని పరిగణించాలి, ఎవరికి కరోనా డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలి అనే దానిపై క్లారిటీ ఇస్తూ ఈ నెల 3న కేంద్రం గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. వీటితోపాటు నిర్దిష్ట ఫార్మాట్లో కరోనా డెత్ సర్టిఫికెట్కు ఓడీఎఫ్సీను కూడా పంపింది. డెత్ సర్టిఫికెట్లలో మార్పులకు అవకాశమివ్వాలని సూచించింది. అడీషనల్ కలెక్టర్, డీఎంహెచ్వోల నేతృత్వంలో జిల్లాకి ఒక కమిటీని వేయాలని చెప్పింది. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా కమిటీ తన నిర్ణయాన్ని వెల్లడించాలంది. కేంద్రం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 2 రోజుల క్రితమే జిల్లాల వారీగా కమిటీలు వేస్తున్నట్టు రాష్ట్ర సర్కారు ప్రకటించింది. కలెక్టర్ చైర్మన్గా, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మెంబర్ కన్వీనర్గా, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మెంబర్గా కమిటీలు వేసింది.
గైడ్లైన్స్
కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లు ఏ వ్యాధితో చనిపోయినా, కరోనాతోనే మరణించినట్టు పరిగణించాలి. వైరస్ పాజిటివ్ వచ్చి ఇంట్లో చనిపోయినా, హాస్పిటల్లో చనిపోయినా కరోనా మృతిగానే చూడాలి. కరోనాతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నెగెటివ్ రిపోర్టు వచ్చి చనిపోయినా కరోనా మరణంగానే లెక్కించాలి. కరోనా పాజిటివ్ అని తేలిన 30 రోజుల్లోపు ఇంట్లో చనిపోయినా కరోనా డెత్గానే చూడాలి. టెస్టు చేయించుకోకుండా నేరుగా హాస్పిటల్లో అడ్మిట్ అయితే డాక్టర్ నిర్ణయమే ఫైనల్. కరోనాతో ఆత్మహత్య చేసుకున్నా, యాక్సిడెంట్లో మరణించినా కరోనా డెత్గా పరిగణించకూడదు.