అబుదాబీ: ఢిల్లీపై కోల్కతా నైట్ రైడర్స్ అలవోకగా విజయం సాధించింది. ఐపీఎల్ సెకండ్ సీజన్ లో వరుసగా నాలుగు విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ కేపిటల్స్ ను 127 పరుగుల స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన కోల్ కతా.. టార్గెట్ ఛేదనలోనూ అదే స్థాయిలో ఆడుతూ పాడుతూ మరో 10 బంతులు మిగిలి ఉండగానే గెలిచేసింది. కోల్కతా 3 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది.
టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ ఢిల్లీ కేపిటల్స్ కు బ్యాటింగ్ అవకాశం ఇచ్చింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ తడబడుతూనే బ్యాటింగ్ చేపట్టింది. ఢిల్లీ హిట్టర్లు స్టీవెన్ స్మిత్ (39), రిషబ్ పంత్ (39), శిఖర్ ధవన్ (24) మినహా మిగిలిన వారంతా పరుగులు తీయడానికి తీవ్రంగా శ్రమించారు. చురకత్తుల్లాంటి బంతులతో కోల్ కతా బౌలర్లు ఢిల్లీ ఆటగాళ్లను కట్టడి చేయడంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి చచ్చీ చెడీ 127 పరుగులు చేసింది.
చిన్న టార్గెట్ కావడంతో చేజింగ్కు దిగిన కోల్కతా ఇంకా 10 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కోల్ కతా నైట్ రైడర్స్ 18.2 బంతుల్లో 128 పరుగులు చేసి ఢిల్లీని మట్టి కరిపించింది. నితీష్ రాణా (36), శుభమన్ గిల్ (30), సునీల్ నరైన్ (21) ధాటిగా ఆడి ఢిల్లీ జట్టుపై విజయపతాకం ఎగురవేశారు.