
వనపర్తి, వెలుగు: నిరుద్యోగికి, పారిశ్రామికవేత్తలకు మధ్య వారధిగా ఏఐ సాంకేతికతతో డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ తెలంగాణ (డీఈఈటీ)ని రూపొందించారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో డీఈఈటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిశ్రమలకు అవసరమైన నిపుణులను గుర్తించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం డీఈఈటీని రూపొందించిందని తెలిపారు.
నిరుద్యోగులంతా డీఈఈటీలో లాగిన్ అయి గుర్తింపు కార్డు పొందాలని సూచించారు. వచ్చే ఐదేళ్లలో జిల్లాలోని 10 వేల మందికి ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. డీఈఈటీని సమర్ధవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, పరిశ్రమల శాఖ అధికారి జ్యోతి, ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎస్ఎన్ అర్జున్ కుమార్, టాస్క్ మేనేజర్ సిరాజ్ పాల్గొన్నారు.
పీఏసీఎస్ బిల్డింగ్లు ప్రారంభం..
రేవల్లి: మండలంలోని నాగపూర్, రేవల్లిలో రూ.60 లక్షలతో నిర్మించిన పీఏసీఎస్ బిల్డింగ్లను చైర్మన్ లోడే రఘుతో కలిసి ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రారంభించారు. రైతులకు అవసరమైన అన్నిరకాల విత్తనాలు, ఎరువులు, పరికరాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బాధితుల నుంచి వినతిపత్రాలు స్వీకరించి వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. త్వరలో అద్దె భవనాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. తహసీల్దార్ లక్ష్మీదేవి, సత్యశీలా రెడ్డి, పర్వతాలు, సుల్తాన్, గోవర్ధన్, చెన్నకేశవులు, వేణు గోపాల్ పాల్గొన్నారు.
గోపాల్ పేట: మండలం బుద్ధారం గండిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో రూ.13.50 లక్షలతో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ ను ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రారంభించారు. ల్యాబ్ లో అనేక అంశాలు నేర్చుకోవచ్చని, పట్టుదలతో చదువుకొని మంచి పేరు తేవాలని సూచించారు. టీజీఈడబ్ల్యూ ఐడీసీ రామచంద్రం, డీఈ వెంకట్ రెడ్డి, కాలేజీ ప్రిన్సిపాల్ ఆరోగ్యం ఉన్నారు.