కాటేస్తున్న కరెంట్​ తీగలు.. జిల్లాలో ఐదేండ్లలో 140 మంది దుర్మరణం

కాటేస్తున్న కరెంట్​ తీగలు.. జిల్లాలో ఐదేండ్లలో 140 మంది దుర్మరణం
  • 350కి పైగా మూగజీవాల మృత్యువాత
  •  అమరవాదిలో ఒకేరోజు 14 గేదెలు మృతి
  • నెన్నెల మండలంలో మరో మూడు గేదెలు
  • వానాకాలంలో పొంచిఉన్న ప్రమాదాలు
  • లైన్లు సరిచేయడంలో అధికారులు విఫలం

మంచిర్యాల, వెలుగు: జిల్లాలో కరెంట్​షాక్​ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇండ్లలో, పొలాల్లో, ఇతర పని ప్రదేశాల్లో షాక్​తగిలి మృత్యువాతపడుతున్నారు. కూలర్లు, మొబైల్ చార్జింగ్, బోర్​మోటార్లు, కరెంట్​వైర్లతో కట్టిన దండేల వల్ల ఎక్కువగా చనిపోతున్నారు. పొలాల్లోని మోటార్లు రిపేర్లు చేస్తూ, ట్రాన్స్​ఫార్మర్ల దగ్గర షాక్​తగిలి రైతులు మరణిస్తున్నారు. చిన్న ఏమరపాటు కారణంగా నిండుప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోతున్నాయి. ఏడాది కాలంగా జిల్లావ్యాప్తంగా 24 మంది చనిపోగా, నాలుగు సంవత్సరాల్లో 140 మంది కరెంట్​కాటుకు బలయ్యారు. 

ఏమరపాటుతో ప్రాణాలు బలి 

ఇటీవల కాసిపేట మండలం దేవాపూర్​అంగడి బజార్​కు చెందిన ఎలక్ట్రీషియన్​మన్నె శాంసన్​ప్రశాంత్​కుమార్(40) కరెంట్​షాక్​తో చనిపోయాడు. ఇంటి ఆవరణలోని బావి వద్ద కరెంట్​మోటార్ స్విచ్​ఆన్​ చేయగా.. నీళ్లు రాకపోవడంతో మోటార్​కు ఉన్న జే వైరును కదిలించాడు. దానికి కరెంట్​సప్లై జరిగి షాక్​ రావడంతో స్పాట్​లోనే మృతిచెందాడు. రెండేండ్ల క్రితం చెన్నూర్​టౌన్​లోని లైన్​గడ్డకు చెంది బొల్లంపల్లి శ్రీనివాస్–శశిదేవి దంపతులు ఇదే రీతిలో కరెంట్​షాక్​తో ప్రాణాలు కోల్పోయారు. శశిదేవి ఉదయం బోర్ వేసి పైపుతో నీళ్లు పడుతూ ఇల్లు శుభ్రం చేసింది. బయట ఇనుప తీగతో కట్టి ఉన్న దండెంపై బట్టలు ఆరేయబోయింది. ఆ దండేనికి కరెంట్​వైర్​తగిలి ఉండటంతో షాక్‌ కొట్టి పడిపోయింది. భార్యను కాపాడాలనే తపనతో భర్త శ్రీనివాస్ ఆమె చేయి విడిపించేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడికి కూడా షాక్ కొట్టి కుప్పకూలిపోయాడు.  

పొలాల్లో పశువులకు ముప్పు

ఈ నెల 18న మందమర్రి మండలం అమరవాది గ్రామంలో14 బర్రెలు కరెంట్​షాక్​తో చనిపోయాయి. కూరగాయల తోటను జంతువుల నుంచి కాపాడుకునేందుకు ఓ రైతు కరెంట్ తీగలు అమర్చగా అవి పక్కనున్న చెరువులో పడ్డాయి. మేతకు వెళ్లిన బర్రెలు చెరువులో దిగడంతో షాక్​తగిలి చనిపోయాయి. వాటిల్లో పాలిచ్చేవి కూడా ఉన్నాయి. తమ కుటుంబాలకు ఆసరాగా ఉన్న గేదెలు చనిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ నెల 25న నెన్నెల మండలం నార్వాయిపేట శివారులోని పొలాల్లో కరెంట్​షాక్​తో మూడు బర్రెలు మృతి చెందాయి. శనివారం రాత్రి కురిసిన గాలివానకు గుండ్లసోమారానికి వెళ్లే 11కేవీ వైర్లు తెగిపోయాయి. 

ఆదివారం ఉదయం మేత కోసం వెళ్లిన బర్రెలు వైర్లకు తాకి చనిపోయాయి. అదే రోజు చెన్నూర్​మండలం ముత్తారావుపల్లి శివారులోని పొలంలో మేత మేస్తున్న ఎద్దు ట్రాన్స్​ఫార్మర్ ఎర్త్​వైరుకు తగిలి చనిపోయింది. పొరుగునున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లిలో ఇటీవల దుక్కిటెడ్లు మృత్యువాతపడ్డాయి. మేతకోసం పొలాల్లోకి వెళ్లిన సమయంలో గాలిదుమారానికి కరెంట్​వైర్లు తెగిపడగా వాటికి తాకి ఒకేసారి ఎనిమిది ఎడ్లు ప్రాణాలు విడిచాయి.

లైన్లు సరిచేయడంలో నిర్లక్ష్యం

పొలాల్లో వేలాడుతూ, ప్రమాదకరంగా మారిన లైన్లను సరిచేయడంలో విద్యుత్​శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఏటా వర్షాకాలంలో గాలివానకు వైర్లు తెగిపోవడం, పోల్స్, ట్రాన్స్​ఫార్మర్ల వద్ద ఏర్పాటు చేసిన సపోర్ట్, ఎర్త్ వైర్లకు కరెంట్​సప్లై కావడం వంటి ఘటనలతో మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందు పొలాల్లో ప్రమాదకరంగా ఉన్న లైన్లను గుర్తించి రిపేర్లు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. వర్షాకాలంలో కరెంట్​ షాక్​ బారిపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారు.

జిల్లాలో కరెంట్​ షాక్​తో చనిపోయిన  మనుషులు, పశువుల వివరాలు

సంవత్సరం    మనుషులు    జంతువులు
2020–21    40    86
2021–22    28    56
2022–23    27    69
2023–24    21    61
2024–25    24    47
మొత్తం    140    319