స్టైపెండ్ చెల్లించని ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై చర్యలు తీసుకోండి

స్టైపెండ్ చెల్లించని ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై  చర్యలు తీసుకోండి
  • ఎన్ఎంసీకి లేఖ రాసిన ఎఫ్ఏఐఎంఏ
  • కరీంనగర్​లో 64 మంది ఇంటర్న్స్‌‌ను సస్పెండ్ చేయడం సరికాదు
  • సీఏఐఎంఎస్ కాలేజీపై డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: స్టైపెండ్ కోసం నిరసన తెలిపినందుకు 64 మంది మెడికోలను సస్పెండ్ చేసిన కరీంనగర్  చల్మెడ ఆనందరావు మెడికల్​ కాలేజీపై డిసిప్లినరీ యాక్షన్​ తీసుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఎఫ్ఏఐఎంఏ) డిమాండ్ చేసింది.  విద్యార్ధులపై పోలీసులు అవమానకరంగా  ప్రవర్తించారని, ఇంటర్న్స్​తో  బలవంతంగా తప్పుడు డిక్లరేషన్ వీడియోలు తీయించి, కాలేజీ అంతర్గత సమస్య అని ప్రకటించడం దారుణమని పేర్కొన్నది. 

అలాగే, రాష్ట్రంలో స్టైపెండ్ చెల్లించని 23 ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కు ఎఫ్ఏఐఎంఏ శనివారం లేఖ రాసింది. రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు విద్యార్ధులకు కేవలం రూ. 2వేల నుంచి రూ. 5వేలు మాత్రమే స్టైపెండ్ చెల్లిస్తున్నాయని , ఇంకొన్ని  ఇవ్వడం కూడా మానేశాయని తెలిపింది.

 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తక్షణమే స్టైపెండ్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, సీఏఐఎంఎస్ ఘటనలపై  యాక్షన్ తీసుకోవాలని కోరింది. ఇంటర్న్స్​కు కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేయొద్దని, స్టైపెండ్ చెల్లింపులను పర్యవేక్షించేందుకు మానిటరింగ్ మెకానిజంను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. భవిష్యత్తులోనూ ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.