- జవాబుదారీతనమే లేకుండా పోయింది: సుప్రీంకోర్టు
- తప్పుగా రాస్తరు.. పైగా హక్కని అంటరు
- సామాన్యులకు ఫేస్బుక్, ట్విట్టర్ స్పందించవు
- తబ్లిగీ జమాత్లపై దాఖలైన పిటిషన్ల విచారణలో కామెంట్
- కేంద్రం ఐటీ రూల్స్ తెచ్చింది
మతపరమైన వార్తలతో పాటు ప్లాన్చేసి మరీ కొందరు వార్తలు రాస్తున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు చెప్పారు. ఆన్లైన్, వెబ్పోర్టల్ లోని కంటెంట్ ను రెగ్యులేట్ చేయడానికి కేంద్రం ఐటీ రూల్స్ తీసుకొచ్చిందని వివరించారు. పత్రికా స్వేచ్ఛ, సరైన వార్తలను పొందాలనుకునే పౌరుల హక్కు మధ్య బ్యాలెన్స్ పాటించడం ప్రస్తుత సవాలని చెప్పారు. కాగా, ఐటీ రూల్స్పై అన్ని హైకోర్టుల్లో ఉన్న పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. వీటిపై 6 వారాల తర్వాత విచారణ చేపడతామంది.
న్యూఢిల్లీ: సోషల్ మీడియా, వెబ్ పోర్టళ్లు, యూట్యూబ్లో ఫేక్ న్యూస్ ఎక్కువవుతోందని.. జవాబుదారీతనం లేకుండా పోయిందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని ఇన్స్టిట్యూషన్లు వార్తలను చెడుగా రాస్తాయని, ఆ న్యూస్ గురించి ఎవరడిగినా స్పందించవని, పైగా రాయడం తమ హక్కుఅని చెబుతాయని మండిపడింది. ఓ సెక్షన్ మీడియాలో ప్రతి విషయాన్నీ మత కోణంలో చూపిస్తున్నారని, దీని వల్ల దేశానికి చెడ్డ పేరు వస్తోందని చెప్పింది. మాధ్యమాలు పవర్ ఫుల్ వ్యక్తుల మాటలే వింటున్నాయని.. జడ్జిలు, ఇన్స్టిట్యూషన్లను పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మామూలు మనుషుల విషయంలో బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయని మండిపడింది. జామియత్ ఉలేమా ఇ హింద్తోపాటు తబ్లిగీ జమాత్కు సంబంధించి దాఖలైన మరికొన్ని పిటిషన్లపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ గురువారం విచారణ జరిపింది. గతేడాది జరిగిన నిజాముద్దీన్ మర్కజ్మతపర కార్యక్రమానికి సంబంధించి ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతోందని, వాటిని కట్టడి చేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోర్టును పిటిషనర్లు కోరారు. అలాంటి ఫేక్ న్యూస్కు కారణమైన వాళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఫేక్ వార్తల కంట్రోల్కు ఏం చేసిన్రు?
కేసు విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక కామెంట్స్ చేశారు. ‘ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా సంస్థలు సామాన్య ప్రజలకు సమస్యలకు స్పందించినట్టు నాకెక్కడా కనిపించలేదు. అవి అసలు రెస్పాండ్ కావు. జవాబుదారీతనమే లేదు. మాధ్యమాలన్నీ పవర్ఫుల్ వ్యక్తుల మాటలే వింటాయి. జడ్జిలు, ఇన్స్టిట్యూషన్లు, సాధారణ ప్రజలను పట్టించుకోవు. ఇది మనకు చాలాసార్లు అనుభవమైంది. వెబ్సైట్లు, యూట్యూబ్ చానళ్లలో వస్తున్న ఫేక్ వార్తలపై కంట్రోల్ లేదు. యూట్యూబ్లో ఎవరైనా చానల్ స్టార్ట్ చేసేయొచ్చు’ అని జస్టిస్ రమణ అన్నారు. న్యూస్ పేపర్లు, చానళ్లకు రెగ్యులేటరీ మెకానిజం ఉందని, వెబ్ పోర్టళ్లకు అలాంటి మెకానిజం లేదన్నారు. ఇలాంటి వాటిని రెగ్యులేట్ చేయడానికి కేంద్రం ప్రయత్నించిందా, రెగ్యులేటరీ కమిషన్ను నియమించిందా అని ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ కంట్రోల్ చేయాలి
సోషల్ మీడియా, వెబ్ పోర్టళ్లలో ఫేక్ న్యూస్ ఎక్కువవుతోంది. అసలు జవాబుదారీతనమే లేదు. ఈ సంస్థలన్నీ పవర్ఫుల్ వ్యక్తుల మాటలే వింటున్నాయి. జడ్జిలను, జనాన్ని పట్టించుకోవట్లేదు. కొందరు తప్పుడు వార్తలు రాస్తారు. పైగా అది తమ హక్కు అని అంటారు. ఇంకొందరు ప్రతి విషయానికీ మతం రంగు పులుముతున్నరు. దీని వల్ల దేశానికి చెడ్డ పేరు వస్తోంది. ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి రెగ్యులేటరీ మెకానిజం ఉండాలి. ‑ సీజేఐ ఎన్వీ రమణ