ట్రిపులార్ పరిహారంపై నిర్వాసితుల్లో ఆందోళన.. నోటీసులు తీసుకోని నర్సన్నపేట రైతులు

 ట్రిపులార్ పరిహారంపై  నిర్వాసితుల్లో ఆందోళన.. నోటీసులు తీసుకోని నర్సన్నపేట రైతులు
  • మెరుగైన పరిహారం కోసం డిమాండ్
  • ఏడు గ్రామాల్లోని రైతులకు నోటీసులు జారీ

సిద్దిపేట, వెలుగు: ట్రిపులార్ ఉత్తర భాగంలో భూములు కోల్పోతున్న రైతుల్లో ఆందోళన మొదలైంది. ఏడు గ్రామాల్లో సర్వే పూర్తయిన రైతులకు పరిహారం నిర్ణయించి వారం రోజులుగా రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా మర్కుక్ మండలం నర్సన్నపేటలో 75 మంది రైతులకు నోటీసులు పంపగా వారు వాటిని తీసుకోకుండా నిరసన తెలిపారు. ఎకరాకు రూ.కోటి పలికే భూమికి కేవలం రూ.7.40 లక్షలు మాత్రమే ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ట్రిపులార్ టెండర్ల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో  భూసేకరణ కోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు.

 ఇందుకోసం కాలా( కాంపిటెంట్​అథారిటీ ఫర్ ల్యాండ్ అక్విజేషన్)ను ఏర్పాటు చేసి రైతుల అభిప్రాయాల సేకరణతో పాటు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.  సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ డివిజన్ పరిధిలోని జగదేవ్ పూర్, గజ్వేల్, వర్గల్, మర్కుక్, ములుగు, రాయపోల్ మండలాల పరిధిలోని 17 గ్రామాల్లో  980 ఎకరాలను 1168  మంది రైతుల నుంచి సేకరిస్తున్నారు.

 జగదేవ్ పూర్ మండలం పీర్లపల్లి, ఇటిక్యాల, మర్కుక్ మండలం అంగడి కిష్టాపూర్, చేబర్తి, ఎర్రవల్లి, నర్సన్న పేట, పాములపర్తి, గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్, ముట్రాజ్ పల్లి, సంగాపూర్, మక్త మాసాన్ పల్లి,  బంగ్ల వెంకటాపూర్, వర్గల్ మండలం మైలారం, జబ్బాపూర్, నెంటూర్, రాయపోల్ మండలం బేగంపేట, ఎల్కల్ గ్రామాల నుంచి ట్రిపులార్ కోసం భూములను 
సేకరించనున్నారు.

పరిహారంపై అసంతృప్తి

గతంలో ఎకరాకు రూ.30 లక్షలు ఇస్తామని మౌఖికంగా చెప్పిన అధికారులు భూసేకరణ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ విలువ  ఆధారంగా పరిహారం నిర్థారిస్తూ నోటీసులు జారీ చేస్తుండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఎకరాకు  కనిష్టంగా రూ.7.40 లక్షల నుంచి  గరిష్టంగా రూ.12 లక్షల వరకు పరిహారం నిర్థారిస్తున్నట్టు సమాచారం.

 కోట్ల విలువ చేసే భూములకు తక్కువ పరిహారం నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ చాలా మంది రైతులు నోటీసులను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. పరిహారం నోటీసులను రైతులు తీసుకోకపోతే పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు మరోసారి రిజిస్టర్ పోస్టులో ఆయా రైతులకు  వ్యక్తిగతంగా నోటీసులను పంపి అధికారులు భూసేకరణ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

గుండె పోటుతో నిర్వాసితుడి మృతి

ట్రిపులార్ కోసం విలువైన భూమిని సేకరిస్తుండడంతో మనోవేదనకు గురై రెండు రోజుల కింద నర్సన్నపేట గ్రామానికి చెందిన ఎంబరి భిక్షపతి(42) గుండెపోటుకు గురై మృతి చెందాడు. గ్రామంలో 30 గుంటల భూమిలో వ్యవసాయం చేస్తూ ఇద్దరు పిల్లల్ని పోషిస్తున్న భిక్షపతికి ఇటీవల అధికారులు నోటీసులు పంపారు. భూ సేకరణ చట్టం ప్రకారం ఎకరాకు రూ.7.40 లక్షలు నిర్థారించి 30 గుంటల భూమిని సేకరిస్తున్నట్టు నోటీసులో తెలిపారు. బహిరంగ మార్కెట్​లో ఎకరాకు కోటి రూపాయల ధర పలుకుతున్న భూమికి తక్కువగా పరిహారం ప్రకటించడంపై మనస్తాపానికి గురై భిక్షపతి గుండె పోటుతో చనిపోయాడు. దీంతో అతడి ఇద్దరు కూతుర్లు అనాథలుగా మారారు.  

పెండింగ్ లో అలైన్​మెంట్ మార్పు 

ట్రిపులార్ అలైన్​మెంట్ మార్పు పెండింగ్​లో పడింది. భూసేకరణకు సర్వం సిద్ధం అయిన తరుణంలో అలైన్​మెంట్​మార్చితే ప్రాజెక్ట్​పనులు మందగిస్తాయని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్ పోర్ట్, నేషనల్ హైవే మినిస్ట్రీ ఆమోద ముద్ర పడిన తర్వాత అలైన్​మెంట్ మార్చాల్సి ఉంటుంది కాబట్టి ఈ అంశాన్ని పెండింగ్ లో పెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి.  కొద్ది నెలల కింద రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్​రెడ్డి  ట్రిపులార్ అలైన్​మెంట్ మార్పు పరిశీలిస్తున్నట్టు ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో గజ్వేల్ నియోజకవర్గం పరిధిలో అధికంగా పచ్చని పంట పొలాలు విలువైన భూముల గుండానే ట్రిపుల్ఆర్ అలైన్​మెంట్ ఉండడంతో మార్పు జరుగుతుందేమోనని ఆశలు చిగురించాయి. మర్కుక్ మండల  భూ నిర్వాసితులు హైదరాబాద్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలసి అలైన్​మెంట్ ను మార్చాలని కోరుతూ వినతిపత్రం సమర్పించినా ఫలితం లేదు. భూ సేకరణకు అధికారులు నోటీసులు జారీ చేస్తుండడంతో పాత అలైన్​మెంట్ కొనసాగుతోందని అందరూ భావిస్తున్నారు.

నోటీసులు జారీ చేస్తున్నాం

ట్రిపులార్ కోసం భూములు సేకరిస్తున్న రైతులకు నోటీసుల జారీ ప్రక్రియను ప్రారంభించాం. అధికారులు నిర్వహించిన సర్వేలో ఎలాంటి ఇబ్బందులు లేని భూములకు సంబంధించి ఏడు గ్రామాల్లోని రైతులకు నోటీసులు జారీ చేశాం. నోటీసులు అందుకున్న తర్వాత 60 రోజుల లోపు తమ అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకరావాలని కోరుతున్నాం. భూసేకరణ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఆయా గ్రామాలకు పరిహారం నిర్థారించాం. - చంద్రకళ, ఆర్డీవో, గజ్వేల్

తక్కువ పరిహారాన్ని అంగీకరించం

ట్రిపులార్ కోసం విలువైన భూములను సేకరిస్తూ తక్కువ పరిహారం నిర్థారించడాన్ని అంగీకరించం.  గతంలో ఎకరాకు రూ.30 లక్షల పరిహారం ఇస్తామన్న అధికారులు ఇప్పుడు మాట మార్చడం దురదృష్ణకరం. పేద రైతులు ఉపాధిని కోల్పోతున్నారన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పరిహారం మరింత పెంచాలి.- కృష్ణ,  రైతు, నర్సన్న పేట