V6 News

పోటెత్తిన పల్లె ఓటరు పంచాయతీ ఎన్నికల్లో భారీగా పోలైన ఓట్లు

పోటెత్తిన పల్లె ఓటరు పంచాయతీ ఎన్నికల్లో భారీగా పోలైన ఓట్లు
  • నిర్మల్​జిల్లాలో అత్యధికంగా  80.42 శాతం ఓటింగ్, మంచిర్యాల జిల్లాలో 80.04, ఆసిఫాబాద్​లో 79.81, ఆదిలాబాద్​లో 77.52 శాతం
  • అత్యధికంగా సిరికొండ మండలంలో 87.04 శాతం
  • కాంగ్రెస్ మద్దుతుదారుల హవా
  • మలుపు తిప్పిన మహిళా ఓట్లు
  • ప్రశాంతంగా ముగిసిన మొదటి దశ ఎన్నికలు

ఆసిఫాబాద్/నిర్మల్/మంచిర్యాల/ఆదిలాబాద్, వెలుగు: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటేసేందుకు పల్లె జనం పోటెత్తారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్​కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఆసిఫాబాద్ ​జిల్లాలోని ఐదు మండలాల్లో 106 గ్రామ పంచాయతీలు, 327 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో జైనూర్, కెరమెరి, లింగపూర్, సిర్పూర్ (యూ), వాంకిడి మండలాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ మహారాష్ట్ర వివాదాస్పద గ్రామం పరందోళిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 

ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా కెరమెరి మండలంలో 83.38 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం చలిని సైతం లెక్క చేయకుండా కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు వేశారు. కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఎస్పీ నితికా పంత్, ఎన్నికల పరిశీలకులు వి.శ్రీనివాస్ వాంకిడి మండలంలోని బెండార, కెరమెరి మండలంలోని కొఠారి పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం నామమాత్రంగానే ఉండగా,11 గంటల తర్వాత పెరిగింది. 

మంచిర్యాల జిల్లాలో 80.04 శాతం

మంచిర్యాల జిల్లాలో 80.04 శాతం పోలింగ్ నమోదైంది. హాజీపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లోని 81 సర్పంచ్, 514 వార్డు మెంబర్ స్థానాలకు ఓటింగ్​జరగ్గా.. 748 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ సెంటర్ల వద్ద బారులుతీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ 
క్యాస్టింగ్ ద్వారా కలెక్టరేట్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా డీసీపీ ఏ.భాస్కర్, ఏసీపీ ఆర్.ప్రకాశ్ ఆధ్వర్యంలో పోలీసులు 400 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి సాయంత్రం వరకు ఫలితాలు వెల్లడించారు.

పెంబిలో 86 శాతం పోలింగ్ 

నిర్మల్ జిల్లాలో 6 మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మహిళలు అత్యధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకొని అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారు. జిల్లాలో మొత్తం 80.42 శాతం పోలింగ్ నమోదయింది. 74 శాతం మంది పురుష ఓటర్లు, 86 శాతం మంది మహిళా ఓటర్లు ఓటు వేశారు. పెంబి మండలంలో అత్యధికంగా 86 శాతం పోలింగ్ నమోదైంది. ఒంటిగంట వరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. కాంగ్రెస్​మద్దతుదారులు సత్తా చాటారు.136 గ్రామ పంచాయతీలకు గాను అత్యధిక గ్రామపంచాయతీల్లో గెలుపొందారు.

ఓటెత్తిన గిరిజనం

ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో గిరిజనం పోటెత్తారు. మొత్తం ఆరు మండలాల్లో 77.52 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యధికంగా సిరికొండ మండలంలో 87.04 శాతం నమోదైంది. మొత్తం 1,52,626 లక్షల ఓటర్లకు గాను 1,18,312 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొదటి విడతలో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆరు మండలాల్లోని 166 గ్రామ పంచాయతీలకు గాను 33 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. 133 సర్పంచ్, 433 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆరు మండలాలు సైతం ఏజెన్సీ ప్రాంతం కావడంతో చాలా మంది ఓటు వేసి పొలం పనుల్లోకి వెళ్లారు. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

ఆదిలాబాద్​జిల్లా..

మండలం    మొత్తం ఓట్లు     పోలైన ఓట్లు     శాతం

ఇచ్చోడ    33,166    26,670    80.41

గాదిగూడ    13,027    10,725    82.33

ఇంద్రవెల్లి    29,648    22,792    76.88

నార్నూర్    19,359    15,643    80.8

సిరికొండ    9639    8390    87.04

ఉట్నూర్     47,787    34,092    71.34

మొత్తం     1,52,626    18,312    77.52

నిర్మల్​జిల్లాలో..

మండలం    మొత్తం ఓటర్లు    పొలైన ఓట్లు    శాతం

దస్తురాబాద్    11625    9443    81.23

కడెం    29159    23285    79.86 

ఖానాపూర్    21995    17441    79.30

లక్ష్మణచాంద    24289    19708    81.14

మామడ    23756    18960    79.81 

పెంబి    9806    8170    83.32

మొత్తం    120630    97007    80.42


ఆసిఫాబాద్​జిల్లా..

మండలం    మొత్తం ఓటర్లు    పొలైన ఓట్లు    శాతం

జైనూర్    24363    18713    76..81

కెరమెరి    22993    19171    83.38

లింగపూర్    8867    7059    79.61

సిర్పూర్ (యూ )    12277    9966    81.18

వాంకిడి    27568    21760    78.93

మొత్తం    96068    76668    79.81


మంచిర్యాల జిల్లా..

మండలం    మొత్తం ఓట్లు    పోలైనవి    పర్సెంట్

దండేపల్లి     34,213    27,362     79.98

హాజీపూర్    16,954    14,420    85.05

జన్నారం    43,306     33,257    75.80

లక్సెట్టిపేట    25,227     20,771     82.34

మొత్తం    1,19,700    95,810    80.04