
- హైదరాబాద్ను నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దుతం: మంత్రి శ్రీధర్ బాబు
- ఎమర్జింగ్ స్కిల్పై నాస్కామ్, కౌన్సిల్ మధ్య ఎంవోయూ
హైదరాబాద్, వెలుగు: డిగ్రీ పూర్తిచేసిన ప్రతి స్టూడెంట్కు ఉద్యోగం లభించేలా స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ను భారతదేశ నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. శుక్రవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ), నాస్కామ్/ ఐటీఐటీఈఎస్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ మధ్య హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎమర్జింగ్ టెక్నాలజీ స్కిల్స్ అందించేందుకు గానూ ఎంవోయూ కుదిరింది.
మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో నాస్కామ్ సీఈవో డాక్టర్ అభిలాషా గౌర్, కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. వర్సిటీలు కూడా నైపుణ్య శిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా (ఏటీసీ) మార్చామని, వాటిల్లో చదివే ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉన్నామని చెప్పారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యాసంస్థల సహకారంతో తగిన నైపుణ్యాలు, ఇంటర్న్షిప్ అవకాశాలను విద్యార్థులకు అందించడంపై దృష్టి సారించామని వివరించారు.
దీనికి అనుగుణంగా టీచింగ్లోనూ మార్పులు చేస్తున్నట్టు తెలిపారు. టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కొత్త కరికులం ద్వారా విద్యార్థుల ఉపాధి సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు. నాస్కామ్ తో ఒప్పందం ద్వారా ఇంజినీరింగ్, నాన్ -ఇంజినీరింగ్ విద్యార్థులతో పాటు ఫ్యాకల్టీకి డిజిటల్ మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సస్టైనబుల్ సైన్సెస్ వంటి ఎమర్జింగ్ కోర్సుల్లో శిక్షణ అందించనున్నట్టు చెప్పారు. నాస్కామ్ సీఈఓ డాక్టర్ అభిలాషా గౌర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యం అవసరమని తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇస్తామని, వర్సిటీలు క్రెడిట్స్ కూడా ఇచ్చే యోచనలో ఉన్నాయని వివరించారు. ఐటీ సెక్టార్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధి అవకాశాలే లక్ష్యంగా శిక్షణ ఇవ్వబోతున్నట్టు చెప్పారు.