
- ఎలక్ట్రికల్ వెహికల్స్ రంగంలో మరో 3 లక్షల జాబ్స్ కల్పిస్తం: కేటీఆర్
- ఐటీ ఎగుమతులను 3 లక్షల కోట్లకు పెంచుతం
- పల్లెల్లో డిజిటల్ సేవలకు 1,200 సెంటర్లు పెడ్తం
- 8 వేల స్టార్టప్ ల కోసం రూ.13 వేల కోట్లు కేటాయిస్తం
- సెకండ్ ఐటీ పాలసీ ఆవిష్కరణలో మంత్రి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఐదేండ్లలో ఐటీ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఐటీ ఎగుమతులను రూ.3 లక్షల కోట్లకు పెంచుతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. గురువారం హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో సెకండ్ ఐటీ పాలసీ 2021–2026 ను నాస్కామ్ చైర్ పర్సన్ రేఖా మీనన్తో కలిసి ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను డిజిటల్ ఎంపవర్ చేయడమే ఈ పాలసీ ముఖ్య ఉద్దేశమని కేటీఆర్ తెలిపారు. ప్రజలు స్మార్ట్ ఫోన్ల ద్వారా ఇంట్లో నుంచే ఉత్తమ సేవలు పొందేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్రంలో వంద శాతం పేపర్ లెస్ సిటిజన్ సర్వీసెస్ అందుబాటులోకి తీసుకొచ్చామని.. వెబ్ సైట్లు, యాప్ ల ద్వారా వీటిని అందజేస్తున్నామని పేర్కొన్నారు. ‘‘ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈవీ పాలసీ తీసుకొచ్చింది. రూ.75 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వీటి ద్వారా 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. మున్సిపల్ శాఖతో కలిసి పట్టణ ప్రాంతాల్లో 40 స్మార్ట్ రీజియన్లు ఏర్పాటు చేస్తాం. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే కాదు.. ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. స్టార్టప్లు, ఇన్వెస్ట్మెంట్లకు తెలంగాణ ఫస్ట్ చాయిస్గా నిలుస్తోంది” అని కేటీఆర్ అన్నారు.
డబుల్ డిజిట్ గ్రోత్: రేఖా మీనన్
ఆరేండ్ల తర్వాత ఐటీ ఇండస్ట్రీ డబుల్ డిజిట్ గ్రోత్ రేటు సాధిస్తుందని నాస్కామ్ చైర్పర్సన్ రేఖా మీనన్ చెప్పారు. జీడీపీలో 8 శాతం ఐటీ సెక్టార్ నుంచి సమకూరుతుందన్నారు. కొన్నేండ్లుగా ఇన్నోవేషన్ టెక్నాలజీలో రాష్ట్రం ప్రగతి సాధిస్తోందని, రాష్ట్రంతో కలిసి పని చేస్తామన్నారు. ఐటీ ఇండస్ట్రీకి స్కిల్స్ ఉన్న యువత దొరకడం లేదని నాస్కామ్ మాజీ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి అన్నారు. యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రైఫ్మెన్, టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ రాజన్న, సీపీ స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు.
ఇండస్ట్రియల్ పార్కుల్లో ఐటీ పార్కులు
కొత్త పాలసీ మేరకు ఇప్పటి వరకు ఇండస్ట్రియల్ పార్కులుగా పేర్కొన్న స్థలాల్లో ఐటీ పార్కులకూ చోటు కల్పించనున్నారు. ప్రభుత్వ భూమి పొందిన సంస్థలు, ప్రైవేటు భూమిని కొన్న రియల్ ఎస్టేట్ డెవలపర్స్, ఐటీ రంగాన్ని ప్రమోట్ చేసే థర్డ్ పార్టీ డెవలపర్స్కు ఐటీ పార్క్ కింద స్థలం కేటాయిస్తారు. ఐటీ, ఐటీయేతర కంపెనీల నిష్పత్తి 60:40గా నిర్ణయించారు. గ్రిడ్ కారిడార్లో మాత్రం 50:50గా ఉండనుంది. ప్రైవేటు భూముల్లో ఐటీ పార్కులు ఏర్పాటు చేయాలంటే అందులో 25 శాతం భూమిని ఐటీ డిపార్ట్మెంట్కు కేటాయించాలి. ఇప్పటికే ఉన్న ఐటీ పార్కుల్లో ట్రాఫిక్ కష్టాలు తగ్గించడానికి బిల్డప్ స్పేస్ శాతాన్ని 66 నుంచి 60 శాతానికి తగ్గించారు. పార్కింగ్ ఏరియా స్పేస్ 40 శాతానికి పెంచారు.
ఐటీ పాలసీ టార్గెట్స్ ఇవీ...
2016–-21 మొదటి ఐటీ పాలసీ కాలంలో ఐటీ సెక్టార్లో రూ.16 వేల కోట్ల ఇన్వెస్ట్ మెంట్స్ రాగా.. 2021–26లో వాటిని రూ.75 వేల కోట్లకు పెంచాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఒక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ రంగంలోనే రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆరు ఇండస్ట్రియల్ పార్కుల కోసం 2 వేల ఎకరాల భూమి అందుబాటులోకి తీసుకురావడం.
టాస్క్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి 2 లక్షల మందిని ఎక్స్పర్ట్స్గా తీర్చిదిద్దడం.
మొబైల్స్, సోలార్ అండ్ మాడ్యూల్స్, ఐటీ హార్డ్ వేర్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీల ఉత్పత్తిపై దృష్టి పెడతారు.