
భారత దేశ విమానయాన చరిత్రలో అతిపెద్ద ఒప్పందం. ప్రైవేట్ విమానయాన సంస్ధ ఇండిగో 500 ఎయిర్బస్ ఏ320 ఎయిర్క్రాఫ్ట్లను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం వివరాలను ఇండిగో చీఫ్ పీటర్ ఎల్బర్స్ ప్రకటించారు. పారిస్ ఎయిర్ షో 2023లో ఇండిగో బోర్డు ఛైర్మన్ వి సుమంత్రన్ సమక్షంలో ఒప్పందం జరిగింది. విమానాల కొనుగోలులో ఇప్పటి వరకు ఈ ఏడాది మార్చిలో ఎయిర్ ఇండియా సంస్థ 470 విమానాల కొనుగోలు ఒప్పందం అతిపెద్ద ఒప్పందంగా కొనసాగింది. కానీ తాజాగా ఇండిగో ఈ ఎయిర్ ఇండియా ఒప్పందాన్ని అధిగమించింది.
ఇండిగో విమానయాన సంస్థ తన కార్యకలాపాలను భారీగా విస్తరించనుంది. దేశీయంగా,అంతర్జాతీయంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు సర్వీసులు పెంచుకునేందుకు ఏకంగా 500 విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్ విమానాయాన సంస్థ ఎయిర్ బస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. 5500 కోట్ల డాలర్ల విలువైన విమానాలను కొనుగోలు చేయనుంది. గత కొద్దిరోజులుగా ఈ భారీ డీల్పై ఎయిర్బస్, ఇండిగో చర్చలు జరుపుతున్నాయి. తాజాగా ఈ చర్చలు ఫలవంతమయ్యాయి. 500 ఎయిర్బస్ లు 2030 నుంచి 2035 సంవత్సరాల మధ్య డెలివరీ కానున్నాయి. A320 నియో కుటుంబంలోని A320Neo, A321Neo, A321 XLR విమానాలు ఉన్నాయి.
భారతదేశ దేశీయ విమానయాన మార్కెట్లో ఇండిగో 60 శాతం వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం ఇండిగో దేశీయంగా, అంతర్జాతీయంగా 300కి పైగా విమానాలను నడుపుతోంది. ఇండిగో ఇప్పటికే 480 విమానాలను ఆర్డర్ చేసింది. ఈ విమానాలు ఈ దశాబ్దం చివరలో డెలివరీ కానున్నాయి. తాజాగా మరో 500 ఎయిర్ క్రాఫ్ట్ ల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. దీంతో ఇండిగో దాదాపు వెయ్యి విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నట్లైంది.